MLA Kota MLC Election Schedule Release: తెలంగాణలో శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అయింది. మార్చి 29వ తేదీతో ఖాళీ కానున్న మూడు స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. నవీన్ రావు, గంగాధర్ గౌడ్, ఎలిమినేటి కృష్ణారెడ్డి పదవీకాలం మార్చి 29వ తేదీతో ముగియనుంది. ఆ స్థానాల్లో కొత్త వారిని ఎన్నుకునేందుకు మార్చి ఆరో తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
![MLA Kota MLC Election Schedule](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17865963_mlc.jpg)
మార్చి 13 వరకు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లు స్వీకరిస్తారు. 14 వ తేదీన పరిశీలన ఉంటుంది. ఉపసంహరణకు 16వ తేదీ వరకు గడువు ఉంటుంది. మార్చి 23వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
ఏపీలో 7 స్థానాలకు షెడ్యూల్ విడుదల : ఏపీలోను 7 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అయింది. మార్చి 6 న నోటిఫికేషన్ వెలువరించనున్న ఈసీ.. మార్చి 13 వరకు నామినేషన్లు స్వీకరించనుంది. మార్చి 14 న పరిశీలన, మార్చి 23న పోలింగ్ నిర్వహించి అదే రోజున కౌంటింగ్ చేపట్టనుంది. ఎమ్మెల్సీల్లో నారా లోకేశ్, భగీరథరెడ్డి, పోతుల సునీత, బచ్చుల అర్జునుడు, డొక్కా మాణిక్య వరప్రసాద్, పెనుమత్స సూర్య నారాయణరాజు, గంగుల ప్రభాకర్రెడ్డిల పదవీకాలం మార్చి నెలాఖరులో ముగియనుంది.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బరిలో 21 మంది : మహబూబ్నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సోమవారం నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. మొత్తం నామినేషన్ వేసిన 21 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రియాంక ప్రకటించారు. సోమవారం నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు కాగా... నిర్ణీత సమయంలోపు నామినేషన్ వేసిన అభ్యర్థులు ఎవరూ విత్ డ్రా కాకపోవడంతో 21 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మార్చి 13న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరగనుంది. మార్చి 16న ఓట్ల లెక్కింపు చేయనున్నట్లు వెల్లడించారు.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం : హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం అయింది. హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల స్థానానికి మజిలీస్ పార్టీకి చెందిన అభ్యర్థి మిర్జా రహమాత్ బెగ్ను ఎన్నిక అయినట్లుగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రియాంక ప్రకటించారు. రహమాత్ బెగ్రు ఎమ్మెల్సీగా గెలుపొందిన ధ్రువీకరణ పత్రాన్ని అందించారు. ఈ స్థానానికి ఇద్దరు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. పరిశీలనలో ఒక నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో ఒక్క అభ్యర్థి మాత్రమే మిగిలారు. దీంతో సోమవారం నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు కావడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు.
ఇవీ చదవండి: