తెలంగాణలో చివరి సెమిస్టర్ పరీక్షలు, ఎంట్రెన్స్లపై హైకోర్టు విచారణ ఆగస్టు 17కు వాయిదా వేసింది. ప్రవేశ పరీక్షలు వాయిదా వేయాలని... డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ చివరి సెమిస్టర్ పరీక్షలు రద్దు చేయాలని కోరుతూ ఎన్ఎస్యూఐ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులో సోమవారం విచారణ చేపట్టారు. పరీక్షలకు సంబంధించిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఈ నెల 14న విచారణ జరగనున్నట్లు ఏఐసీటీఈ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఈ మేరకు తదుపరి విచారణను హైకోర్టు ఆగస్టు 17కు వాయిదా వేసింది.
ఈ నెలాఖరు నుంచి ప్రవేశ పరీక్షలు నిర్వహించేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోందని.. చట్టం ప్రకారం ప్రవేశ పరీక్షల నిర్వహణ తప్పనిసరని వివరించింది. అయితే ఈ అంశంపై సుప్రీంకోర్టు తీర్పు ఆదేశాల మేరకే వ్యవహరించాలని కేబినెట్ నిర్ణయించినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇతర సెమిస్టర్ విద్యార్థులను ప్రమోట్ చేయాలని ఇప్పటికే నిర్ణయించామని.. ఆ విషయంలో ఎలాంటి మార్పు లేదని హైకోర్టుకు ప్రభుత్వం వివరించింది.
ఇదీ చూడండి:- ఆ పేలుడుకు అణుబాంబులో ఐదోవంతు శక్తి..!