హైదరాబాద్లో ముంపు బాధితులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని... పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఖైరతాబాద్ పరిధిలో వరద ప్రభావిత ప్రాంతాలైన ఎంఎస్ మక్తా, రాజ్నగర్లో పర్యటించిన మంత్రి... బాధితులకు ప్రభుత్వం తరఫున రూ. 10 వేల ఆర్థికసాయం అందించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మూడు నుంచి 4 లక్షల బాధిత కుటుంబాలకు పరిహారం అందిస్తామన్నారు.
పరిహారం పెంచేందుకు సుముఖం...
ఆర్థిక సాయం ఇంకా పెంచేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. విపత్తు వేళ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఇతర ప్రజాప్రతినిధులు, నివాసిత సంక్షేమ సంఘాలు, ఎన్జీఓలు కలిసికట్టుగా ప్రజలకు సాయం అందేలా ప్రభుత్వానికి సహకరించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కేటీఆర్తో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, మేయర్ బొంతు రామ్మోహన్ బాధితులను పరామర్శించారు.
వరద బాధితులకు సర్కార్ బాసటగా నిలుస్తుందని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ప్రతిపక్షాలు విమర్శలు మాని బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వంతో కలిసిరావాలని సూచించారు. అమీర్పేట డివిజన్ బస్తీనగర్లో వరద బాధిత కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం చెక్కులు అందించారు.
సురక్షిత ప్రాంతాలకు వెళ్లండి...
మీర్పేట్లో వరద బాధితులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆర్థిక సహాయం అందజేశారు. నష్టపోయిన వాళ్లందరికీ రూ. 10 వేల సాయం అందజేస్తామని స్పష్టం చేశారు. వరద సాయం ప్రకటించని కేంద్రం తీరుపై... మంత్రి సబిత మండిపడ్డారు. వరదలతో ఇళ్లు కోల్పోయినవారిని ఆదుకుంటామని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి భరోసా ఇచ్చారు. ఓల్డ్ బోయిన్పల్లిలో ఆరు వందల కుటుంబాలకు స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి మంత్రి ఆర్థిక సాయం చెక్కులు అందజేశారు. మరో 3 రోజులు వర్షాలున్నందున.. అధికారులకు ప్రజలు సహకరించి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు.
కొంపల్లి పురపాలిక పరిధిలోని ఉమామహేశ్వర కాలనీ వరద బాధితులకు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు చెక్కులు అందించారు.