రాష్ట్రంలో భారతీయ స్టేట్ బ్యాంక్ ఖాతాదారులకు మరింత చేరువ అయ్యేందుకు సరికొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లాలని బ్యాంకు యాజమాన్యం నిర్ణయించింది. హైదరాబాద్లో బ్యాంకు యాజమాన్యం రెండు రోజుల పాటు మేధోమథన కార్యక్రమం ఏర్పాటు చేసింది. 750 బ్యాంకు శాఖలకు చెందిన మేనేజర్లు, ప్రాంతీయ మేనేజర్లు, సీనియర్ అధికారులు పాల్గొన్న ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ ఓం ప్రకాశ్ మిశ్రా పాల్గొన్నారు. దేశ అభివృద్ధిలో బ్యాంకుల భాగస్వామ్యాన్ని పెంచేందుకు అనేక అంశాలపై చర్చలు, కొత్త ఆలోచనల ఆవిష్కరణలు జరిగినట్లు ఎస్బీఐ తెలిపింది. వీటి ఆధారంగా రాష్ట్ర స్థాయిలో కార్యాచరణను రూపొందిస్తామని, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో బ్యాంకు సేవలు సులభతరం చేస్తామని ఓం ప్రకాశ్ అన్నారు. రైతులు, చిన్న పారిశ్రామిక వేత్తలు, చిన్న వాణిజ్య సంస్థలు, విద్యార్థులు, మహిళలను వృద్ధులకు సేవలు అందించడంలో మరింత బాధ్యతగా వ్యవహరిస్తామన్నారు.
ఇదీ చూడండి :తెలంగాణలో భాజపాను బలోపేతం చేయడమే ధ్యేయం