హైదరాబాద్ జూబ్లీహిల్స్ నుంచి పంజాగుట్ట కూడలి వరకు సాఫీగా సాగిపోవాలన్న నగరవాసుల స్వప్నం ఎట్టకేలకు నెరవేరనుంది. కేవలం 3 నెలల్లోనే పంజాగుట్ట నాగార్జున సర్కిల్లోని శ్మశానవాటిక మీదుగా ఉక్కు వంతెనను జీహెచ్ఎంసీ నిర్మించింది. ఈనెల 10 వరకు అందుబాటులోకి రానుండటం వల్ల వాహనదారులకు ప్రస్తుతమున్న రెండు వరుసల రోడ్డు మార్గానికి అదనంగా వంతెన రూపంలో మరో రెండు లైన్ల మార్గం అందుబాటులోకి వచ్చినట్లవుతుంది.
రోజుకు 15 గంటల పాటు పనులు..
బల్దియా మార్చి 16న ఉక్కు వంతెన నిర్మాణ పనులను ప్రారంభించింది. యంత్రాలను, కూలీలను మూడు రెట్లు పెంచి లాక్డౌన్లోనూ రోజుకి 15 గంటల పాటు పనులు నిర్వహించారు. దాదాపు 180 టన్నుల భారీ ఇనుప దిమ్మెలను స్తంభాలపై అమర్చడం వల్ల గడువుకు ముందే వంతెన కల సాకారమైంది. పాదచారుల కోసం కాలిబాట వదలిపెట్టారు. సుల్తాన్-ఉల్-ఉలూమ్ కళాశాల నుంచి నాగార్జున సర్కిల్ వైపు వెళ్లే వాహనాలకు ఈ వంతెన ఎంతో ఉపయోగపడనుంది.
వంతెన సంబంధిత వివరాలు:
వ్యయం | రూ. 6 కోట్లు |
పొడవు | 100 మీటర్లు |
వెడల్పు | 6 మీటర్లు |
ఇదీ చూడండి: మెట్రో టికెట్ ధరలపై హైకోర్టులో సీపీఎం పిటిషన్