రాష్ట్రం యావత్తూ గణతంత్ర వేడుకలకు ముస్తాబైంది. పబ్లిక్ గార్డెన్స్లో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ తమిళిసై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం సాయుధబలగాల గౌరవవందనం స్వీకరిస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. కరోనా కారణంగా రాజ్భవన్లో ఈసారి ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్వహించడం లేదు.
చారిత్రక భవనాలు
జెండా పండుగకు భాగ్యనగరం అందంగా ముస్తాబైంది. నగరంలో ప్రభుత్వ, చారిత్రక భవనాలు త్రివర్ణశోభితంగా కాంతులీనుతున్నాయి. అసెంబ్లీ, జీఎస్టీ భవన్, బీఆర్కే భవన్, శాసనమండలి, నాంపల్లి పబ్లిక్ గార్డెన్, గన్పార్క్లోని అమరవీరుల స్థూపం విద్యుత్దీపపు కాంతుల్లో వెలిగిపోతున్నాయి.
రైల్ నిలయం
దక్షిణ మధ్య రైల్వే... భవనాలను దీపకాంతులతో అలంకరించింది. రైల్ నిలయం, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ తదితర భవనాలను మూడు రంగులతో ముస్తాబుచేశారు.
ప్రదర్శన ఆహుతులు
భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని చారిత్రక మొజం జాహి మార్కెట్ వద్ధ కవ్వాలి ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకుంది. షామ్-ఏ-సూఫీయానా అనే పేరుతో జీహెచ్ఎంసీ, మున్సిపల్ పరిపాలనా శాఖ నిర్వహించిన వార్శి బ్రదర్స్ కవ్వాలీ ప్రదర్శనకు కవ్వాలీ ప్రేమికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
రిపబ్లిక్ డే సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా... పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
ఇదీ చూడండి : ఐస్క్రీంను విడుదల చేయనున్న ఎంపీ, మంత్రులు