సికింద్రాబాద్ హస్మత్పేట్లో ఓ అర్చకుడి ఇంట్లో దొంగతనం కేసులో నిందితుడిని అల్వాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ గోఖులరా ప్రాంతానికి చెందిన నీరజ్ శర్మ అనే వ్యక్తి ఈ దొంగతనానికి పాల్పడినట్లు వారు తెలిపారు. అతను 2008 నుంచి హస్మత్పేట్, అంజయ్యనగర్లో కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నట్లు వెల్లడించారు. అదే ప్రాంతానికి చెందిన సాయిశర్మ స్థానిక దేవాలయంలో అర్చకుడిగా విధులు నిర్వహిస్తున్నారు.
ఈ నెల 8న సాయిశర్మ కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లడం గమనించిన నీరజ్... 9వ తేది రాత్రి అర్చకుడి ఇంట్లో 6తులాల బంగారు, 30తులాల వెండి ఆభరణాలను దొంగిలించినట్లు పోలీసులు తెలిపారు. 12వ తేదిన అనుమానస్పదంగా తిరుగుతున్న నీరజ్ను విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు వెల్లడించారు. అతని నుంచి అభరణాలను స్వాధీనం చేసుకుని, రిమాండ్కు తరలించినట్లు చెప్పారు.
ఇదీ చదవండి: నకిలీ ఇన్ వాయిస్లతో రూ.14.20 కోట్లు కాజేశారు!