ఆర్థిక ఇబ్బందులతో చదువులకు దూరమవుతున్న చేనేత, పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన పేద విద్యార్థులను ఆదుకునే లక్ష్యంతో తెలంగాణ పద్మశాలి అఫిషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యాజ్యోతి కార్యక్రమం ప్రారంభమైంది. హైదరాబాద్ నారాయణగూడలోని పద్మశాలి భవనంలో రాజ్యసభ మాజీ సభ్యుడు రాపోలు ఆనంద్ భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కరదీపిక, సంఘం క్యాలెండర్ని ఆవిష్కరించారు.
సంఘం పక్షాన ఇద్దరు మెడికల్, ఇంజినీరింగ్ విద్యార్థులకు రూ.25వేల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. చదువుతో సమాజంలోని అనేక రుగ్మతలు మాయమవుతాయని... సంఘం తరఫున సాధ్యమైనంత ఎక్కువ మందికి సాయం అందేలా చూడాలని ప్రతినిధులను రాపోలు కోరారు. పద్మశాలి ఉద్యోగులను ఒక్కతాటిపైకి తేవడమేకాకుండా... పేద విద్యార్థులకు అండగా నిలిచే విద్యాజ్యోతికి అంకురార్పణ చేయడం అభినందనీయమన్నారు.
మగ్గం బతుకుల్లో వెలుగు నింపే దిశగా సంఘం చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. విద్యాజ్యోతి ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని మరింత మందికి తోడ్పాటునిచ్చే ప్రయత్నం చేస్తామని సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి సామల సహదేవ్ తెలిపారు. అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు కందగట్ల స్వామి, మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు, న్యాయవాది వనం దుశ్యంతల తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: జల్లికట్టుకు మరో ప్రాణం బలి