ఓ వాహనదారుడికి సాయం చేస్తూ ఆదివారం రాత్రి వరదలో కొట్టుకుపోయిన నవీన్(45) సరూర్నగర్ చెరువులో విగతజీవిగా కనిపించాడు. 20 గంటల అన్వేషణలో మృతదేహం బయటపడింది.
మీర్పేట కార్పొరేషన్ ప్రశాంతిహిల్స్కాలనీలో ఉంటున్న నవీన్ ఎలక్ట్రీషియన్. ఆయన భార్య శాలిని బండ్లగూడలోని చాక్లెట్ కంపెనీలో రోజు కూలీ. వీరి ఇద్దరు కుమార్తెలు హర్షిత(14), తేజశ్రీ(12) కీసరలోని బీసీ సంక్షేమ శాఖ వసతి గృహంలో చదువుకుంటున్నారు. ఆదివారం ఉదయం ఎప్పటిలాగానే పనికి వెళ్లిన నవీన్ విధుల ముగించుకుని సాయంత్రం ఇంటికి బయలుదేరాడు. 6.40 గంటలకు లింగోజిగూడ డివిజన్ తపోవన్ కాలనీకి చేరుకున్న నవీన్.. వరద నీటిలో చిక్కుకుని ఓ ద్విచక్రవాహనదారుడు ఇబ్బంది పడుతుండటాన్ని గమనించి సాయం చేసేందుకు ముందుకెళ్లాడు.
వాహనాన్ని ముందుకు నెడుతున్న సమయంలోనే అదుపు కోల్పోయి ఆ వరద నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి సరూర్నగర్ చెరువులో గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది, స్థానిక విపత్తు నిర్వహణ దళం రంగంలోకి దిగారు. బోట్లు లేకపోవడంతో వెతికేందుకు సాధ్యం కాలేదు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి నిపుణులతోపాటు ఇందిరాపార్క్ నుంచి బోట్లను తెప్పించారు. అర్ధరాత్రి 2.30 గంటల వరకు వెతికినా వర్షం, చిమ్మ చీకటి వల్ల ప్రయోజనం లేకపోయింది.
కేవలం 30 మీటర్ల దూరంలోనే..
సోమవారం ఉదయం 7 గంటలకు 4 డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ఒండ్రు మట్టితో సరూర్నగర్ చెరువు బురద బురదగా ఉంది. ఘటనాస్థలి దగ్గర లోతు కూడా 3 నుంచి 4 అడుగుల వరకే ఉంది. చేపలు పట్టేందుకు వినియోగించే కొక్కాల సాయంతో గాలింపు చేపట్టారు. ఎల్బీనగర్ శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ సిబ్బందికి మార్గనిర్దేశం చేశారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో నవీన్ పడిపోయిన చోటు నుంచి 30 మీటర్ల దూరంలో ఓ కొక్కానికి బరువైనదేదో చిక్కినట్లు సిబ్బంది గుర్తించి నిదానంగా పైకి లాగారు. వారి అంచనా నిజమైంది.
3.30 గంటలకు మృతదేహాన్ని బయటకు తీశారు. ఒండ్రు మట్టిలో చిక్కుకుని ఊపిరి అందక మృతి చెంది ఉంటాడని ప్రాథమికంగా అంచనా వేశారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ‘సంతోషంగా సాగిపోతున్న మా సంసారంలో ఈ వరద చిచ్చురేపింది. నా ఇద్దరు పిల్లలను ఎలా సాకాలో అర్థం కావడం లేదు.’ అంటూ నవీన్ భార్య శాలిని విలపించారు. వరదలో కొట్టుకుపోతున్న తన కొడుకును ఎవరూ కాపాడే ప్రయత్నం చేయలేదంటూ నవీన్ తల్లి లలిత వాపోయారు.
నవీన్ కుటుంబాన్ని ఆదుకుంటాం
సరూర్నగర్ చెరువులో కొట్టుకుపోయి మృతి చెందిన నవీన్ కుటుంబాన్ని ఆదుకుంటామని మంత్రి సబితాఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు. ప్రశాంతిహిల్స్కాలనీలో ఉన్న కుటుంబాన్ని సోమవారం పరామర్శించారు. ప్రభుత్వం తరపున రూ.6 లక్షలు పరిహారం ఇస్తామన్నారు. తక్షణ సాయం కింద రూ.50వేలు అందజేశారు. మృతుని భార్య శాలినికి మున్సిపల్ కార్పొరేషన్లో ఉద్యోగం కల్పిస్తామని, రెండు పడక గదుల ఇల్లు కేటాయించేలా కృషి చేస్తానని తెలిపారు.