పాత పురపాలక సంఘాలతో పాటు కొత్త వాటిని అదే స్థాయిలో అభ్యున్నతి చేసేందుకు ప్రత్యేక నిధులను మంజూరు చేస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. ఈక్రమంలో గతేడాది జులై 27న కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పరిగిలో రూ.15కోట్ల అంచనా వ్యయంతో డంపింగ్ యార్డు అభివృద్ధి, కోర్టు భవనం వద్ద నుంచి తహసీల్దారు కార్యాలయం వరకు రోడ్డు విస్తరణ పనులు, పరిగి నుంచి విద్యారణ్యపురికి బీటీ రోడ్డు, పట్టణంలో మురుగు కాల్వల నిర్మాణం తదితర పనులు చేపట్టేందుకు శంకుస్థాపన చేశారు. నిధులు రాకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లు మరింత అధ్వానంగా మారుతున్నాయి. ప్రధానంగా పారిశుద్ధ్య సమస్య పట్టణ వాసులను వెంటాడుతోంది. అంతర్గత రహదారుల నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంది. చాలా చోట్ల దశాబ్దాల కిందట నిర్మించిన మురుగు కాలువలు శిథిలావస్థకు చేరుకున్నాయి.
దినదినాభివృద్ధి చెందుతూ..
పరిగి నియోజకవర్గ కేంద్రంగా ఉండటంతో పరిసర మండలాలకు చెందిన ప్రజలు ఇక్కడే ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు. గృహ నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. కోర్టు సమీపం నుంచి తహసీల్దారు కార్యాలయానికి వెళ్లే రోడ్డు గుంతలు పడి రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తోంది. జిల్లా కేంద్రానికి ఇదే ప్రధాన రహదారి. కోర్టు, సామాజిక ఆసుపత్రి, నీటి పారుదల, అటవీశాఖ కార్యాలయాలు, మినీ స్టేడియం, ఇండోర్ స్టేడియం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, రోడ్లు,భవనాల శాఖ అతిథి గృహం, పశు సంవర్ధకశాఖ, పురపాలక సంఘం, రోడ్లు,భవనాల శాఖ, పంచాయతీరాజ్, ఐసీడీఎస్, ఎంపీడీఓ, తహసీల్దారు, వ్యవసాయ శాఖ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలతో పాటు మండల విద్యా వనరుల కేంద్రం, అగ్నిమాపక కేంద్రం ఇదే దారిలో ఉన్నాయి. నిత్యం వేలాది మంది తమతమ పనుల మీద ఇక్కడకు వస్తుంటారు. రోడ్డు ధ్వంసమై పడుతున్న పాట్లు వర్ణనాతీతం. మరమ్మతులు చేపట్టి కోర్టు కూడలి నుంచి తహసీల్దారు కార్యాలయం వరకు సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు వంటి పనులు చేపట్టాల్సి ఉంది.
పారిశుద్ధ్యం ఇలా..
పట్టణంలో చెత్త దిబ్బ లేకపోవడంతో తరలించేందుకు అవస్థలు పడుతున్నారు. ఇటీవల స్థలం కేటాయించినా పనులు ప్రారంభించలేదు. నిత్యం 9టన్నుల చెత్త విడుదల కాగా, సేకరిస్తున్నది ఐదు టన్నులే. మున్సిపాలిటీలకు ఆర్థిక సంఘం నిధులకు అనుగుణంగా బడ్జెట్లో మ్యాచింగ్ గ్రాంటును ఇస్తామని పేర్కొంది. నిధుల కేటాయింపుతో మౌలిక సదుపాయాలు సమకూరుతాయని త్వరగా మంజూరు చేయాలని కోరుతున్నారు.
మంత్రి హామీ ఇచ్చారు
పురపాలక శాఖ మంత్రి కేటీఆర్తో జరిగిన సమీక్ష సమావేశానికి హాజరయ్యాం. ఈసందర్భంగా నిధులు మంజూరు చేయాలని కోరాం. డిసెంబరు వరకు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. నూతన పురపాలక సంఘ భవన నిర్మాణానికి రూ.5కోట్లు ఇస్తామన్నారు. నిధులు రాగానే దశల వారీగా పనులు చేపడతాం.- అశోక్కుమార్, ఛైర్మన్, పరిగి పురపాలకం
ఇదీ చూడండి: భాజపాలోకి షహీన్బాగ్ నిరసనకారుడు అలీ