పార్లమెంటు మాజీ సభ్యుడు నంది ఎల్లయ్య మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. నంది యల్లయ్య సోదరుడు నంది కృష్ణకు పంపిన లేఖలో ఈ మేరకు ఆయన సంతాపం ప్రకటించారు. నంది యల్లయ్య సుదీర్ఘ రాజకీయ కాలంలో రాష్ట్రానికి, దేశానికి ఆయన అందించిన సేవలు ఎనలేనివని పేర్కొన్నారు.
మున్సిపల్ కార్పొరేషన్ సభ్యుడి స్థాయి నుంచి రెండు సార్లు రాజ్యసభకు, ఆరు సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారన్నారు. తెలంగాణ పీసీసీ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న ఆయన పార్టీలో ఎంతో చురుకైన వ్యక్తి అని, అంకితభావంతో పని చేసేవారని ఆయన కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.