రాష్ట్రంలో అవసరమైన యూరియా అందుబాటులో ఉందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. రైతుల ఆత్మస్థైర్యం దెబ్బతీసే ఉద్దేశపూర్వక దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నామన్నారు. కరోనా విపత్తు గ్రహించే సీఎం కేసీఆర్... వ్యవసాయరంగానికి పలు మినహాయింపులతో కూడిన వెసులుబాటు ప్రకటించారని గుర్తు చేశారు. ఈ ఏడాది వానాకాలానికి కావాల్సిన 10.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సహా... అన్ని రకాల ఎరువులు 22.30 లక్షల మెట్రిక్ టన్నులు మొత్తం ఇచ్చేందుకు కేంద్రం ఆమోదించిందని తెలిపారు.
జులై నెల కోటాను కేంద్రం సకాలంలో సరఫరా చేయలేకపోవటంతో వెంటనే సీఎం కేసీఆర్ స్వయంగా... కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రితో మాట్లాడారని తెలిపారు. ఈ నెలకు రావాల్సిన 2.05 లక్షల మెట్రిక్ టన్నులకు 1.06 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రాగా... మిగిలింది ఈ నెలాఖరుకు ఇస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారన్నారు. ప్రస్తుతం 1.56 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని వెల్లడించారు.
ఇటీవల 36 గంటల్లో 56 లక్షల మంది రైతుల ఖాతాలకు రైతుబంధు నిధులు చేరవేసిన సమర్థత వ్యవసాయ శాఖదని... ఇది ప్రపంచ రికార్డ్ మాత్రమే కాక ఆ శాఖ పనితీరుకు నిదర్శనమని కితాబునిచ్చారు. పత్తి పంటకు అవరసరమైన రెండో విడత యూరియా కూడా రైతులు వాడుకున్నారని... మిగిలింది వరి నాట్లకు మాత్రమేనని మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు.