మ్యాట్రిమొనీలో వివరాలు సేకరించి మోసానికి పాల్పడిన ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. హైదరాబాద్ చందానగర్ నల్లగండ్లకు చెందిన ఓ మహిళా వైద్యురాలు రెండో పెళ్లి కోసం భారత్ మాట్రిమొనిలో నమోదు చేసుకున్నారు.
విపుల్ పేరుతో రిక్వెస్ట్..
వివరాలు సేకరించిన నిందితులు డాక్టర్ విపుల్ ప్రకాశ్ పేరుతో రిక్వెస్ట్ పంపించినట్లు పోలీసులు తెలిపారు. యూకేలో ఉంటున్న విపుల్ ఖరీదైన వస్తువులు పంపించాడని... ఆ పార్సిళ్లకు పన్నుల పేరుతో ఒకసారి రూ. 7లక్షల 45వేలు.. మరోసారి రూ. 5లక్షలు ఖాతాకు జమ చేయించుకున్నారని పేర్కొన్నారు. మోసపోయానని గుర్తించిన మహిళ ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన సైబరాబాద్ పోలీసులు... నలుగురిని దిల్లీలో అరెస్టు చేశారు.
బెంగళూరులోనూ..
నేపాల్కు చెందిన ముగ్గురు వ్యక్తులు వివిధ బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి నైజీరియన్లకు వివరాలు ఇస్తున్నట్లు గుర్తించారు. మోసపోయిన వ్యక్తులు ఖాతాలో వేసిన సొమ్ము డ్రాచేసి నైజీరియన్లకు ఇచ్చి కమిషన్ తీసుకుంటున్నారని తెలిపారు. ఈ ముఠా బెంగళూరులోనూ.. మోసాలకు పాల్పడినట్లు వివరించారు. నిందితుల నుంచి 18 చరవాణులు, 67 బ్యాంక్ చెక్ బుక్కులు, ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చూడండి: భాజపా రాష్ట్ర సారథిగా సంజయ్నే ఎందుకు నియమించారంటే?