HYDRA Warning On Illegal Wall Construction : చెరువులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణే కాదు ప్రజలకు నష్టాన్ని చేకూర్చేలా రహదారులను ఆక్రమించినా కూల్చివేత తప్పదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. చుట్టుపక్కల కాలనీలకు దారులను మూసేస్తూ కాలనీ లేఅవుట్లకు గోడలు కట్టుకోవడం చట్టవిరుద్ధమన్నారు. ప్రహరీ నిర్మించుకోవడానికి అనుమతులు ఒప్పుకోవని తెలిపారు.
చట్టవిరుద్ధంగా అడ్డుగోడలు : చట్టవిరుద్ధంగా అడ్డుగోడలు నిర్మించి తమ కాలనీలకు దారి లేకుండా చేస్తున్నారంటూ సోమవారం బుద్ధభవన్లోని హైడ్రా కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి ఫిర్యాదులు చేశారు. ఇటీవల నారపల్లిలో నల్లమల్లారెడ్డి లేఅవుట్లో 4కి.మీ పొడవున లేఅవుట్ చుట్టూ నిర్మించిన ప్రహరీని కూల్చడంతో ఇతర ప్రాంతాల బాధితులు వరుసకట్టారు. మొత్తం 71 ఫిర్యాదులు ప్రజావాణికి అందాయి. వారం నుంచి రెండు వారాల్లో విచారణ పూర్తి చేయాలని కమిషనర్ ఆదేశించారు. తమ ప్లాట్లను నల్ల మల్లారెడ్డి కబ్జా చేశారని ఘట్కేసర్ మండలం కొర్రెములకి చెందిన ఖాజా మీరన్ మొయినుద్దీన్ ఫిర్యాదు చేశారు. అల్వాల్లోని యాప్రాల్ నాగిరెడ్డి గొలుసుకట్టు చెరువును కాపాడాలని యాప్రాల్ కుల సంఘాల జేఏసీ ఛైర్మన్ ఆర్.చంద్రశేఖర్ కోరారు.
రోడ్లకు అడ్డంగా గేట్లు : దివ్యనగర్ లేఔట్ మొత్తం విస్తీర్ణం 200 ఎకరాల వరకూ ఉంటుందని, అందులో 2218 ప్లాట్లు చేయగా వెయ్యి మంది వరకు సింగరేణి ఉద్యోగులు ప్లాట్లను కొనుగోలు చేశారు. మిగతా 30 శాతం ప్లాట్లు నల్ల మల్లారెడ్డివేనని, సర్వే నెంబరు 66లో 6.06 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా నల్ల మల్లారెడ్డి కబ్జాచేశారని స్థానికులు కమిషనర్కు వివరించారు. లేఔట్లలో 40 అడుగులు, 50 అడుగులు, 25 అడుగులు రహదారులు మూసివేసి అడ్డంగా గేట్లు పెట్టారని, భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసి తమ లేఔట్లలోకి రానివ్వడం లేదని హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ప్రజావాణిలో మల్లారెడ్డిపై ఫిర్యాదులు రావడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ప్రభుత్వ భూమిని కబ్జా చేశారనే ఫిర్యాదుపై విచారణ కొనసాగుతుందని స్పష్టం చేశారు.
హైడ్రా ఎఫెక్ట్ - ఒక్క ప్రహరీ గోడ కూల్చివేతతో 20 కాలనీలకు తొలగిన ఇబ్బంది