హైదరాబాద్ ముషీరాబాద్లోని ఓ అపార్ట్మెంట్ సెల్లార్లోని నీటిలో మునిగి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటనను నిరసిస్తూ కాంగ్రెస్, భాజపా నేతలు ఆందోళన చేశారు. ముషీరాబాద్లోని గాయత్రీ సాయి ఈశ్వర్ ఎన్క్లేవ్ అపార్ట్మెంట్ రెండో అంతస్తులో ఉన్న రాజ్కుమార్ శనివారం రాత్రి వర్షం వెలిసిన తర్వాత సూపర్ మార్కెట్ కోసం బయటికి వచ్చారు. అపార్ట్మెంట్ సెల్లార్లో వర్షం నీరు ఉన్న విషయం తెలియక చీకటిలో వచ్చి అందులో పడి మరణించారు. ఈ ఘటన జరిగి మూడు రోజులు కావస్తున్నా జీహెచ్ఎంసీ అధికారులు నీటిని తొలగించలేదు.
ఆ ఘటనను నిరసిస్తూ యువజన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, ముషీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జి అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, నేతలు అపార్ట్మెంట్ ముందు నిరసన జరిపారు. సమీప భవనంలో జరిగిన కార్యక్రమానికి హాజరైన స్థానిక శాసనసభ్యులు ముఠా గోపాల్ తిరిగి వెళ్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఆయనను అడ్డుకున్నారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ సంఘటన పట్ల ప్రభుత్వం స్పందించకపోవటంపై ఆయనను ప్రశ్నించారు. సెల్లార్లో మృతి చెందిన రాజ్కుమార్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే తెలిపారు.
కేవలం 12 గంటల పాటు వర్షం వస్తే నగర ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారుతోందని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. సెల్లార్ నీటిలో రాజ్కుమార్ మునిగి రెండు రోజులు అవుతున్నా జీహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆరోపించారు. రెండు గంటల పాటు నగరంలో వర్షం పడితే రోడ్లు చెరువులుగా మారుతున్నాయని ఎద్దేవా చేశారు. ఈ విషయంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి : ఫార్మాసిటీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ వార్.. చూస్తూ ఊరుకోబోమని వార్నింగ్