Mahila Congress Protest: గాంధీభవన్ నుంచి డీజీపీ ఆఫీసుకు వెళ్లేందుకు ప్రయత్నించిన మహిళా కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. గాంధీభవన్ గేటు వద్దనే అరెస్టు చేసి నారాయణగూడ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు అస్వస్థతకు గురయ్యారు. బలవంతంగా పోలీస్ వాహనం ఎక్కించిన సమయంలో ఆమెకు ఫిట్స్ వచ్చాయి. హుటాహుటిన దగ్గరలోని కేర్ ఆస్పత్రికి తరలించారు.
ఇవాళ మధ్యాహ్నం గాంధీభవన్లో మహిళ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నిన్న ముట్టడి సమయంలో పోలీసుల తోపులాటలో మహిళా నాయకురాలు విద్యారెడ్డి అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలవడాన్ని తీవ్రంగా పరిగణించారు. డీజీపీని కలిసి మహిళా పోలీసులు అనుసరించిన వైఖరిపట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేసి పోలీసు విధులకు భిన్నంగా వ్యవహరించిన కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలని కోరాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా డీజీపీ కార్యాలయానికి వెళ్లేందుకు మహిళా కాంగ్రెస్ నాయకులను ఆదిలోనే అడ్డుకున్నారు.

ఇదీ చూడండి: CONGRESS DHARNA: ప్రభుత్వ వైఖరి వల్లే డిస్కంలు దివాళా తీశాయి: రేవంత్ రెడ్డి