ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. జులై ప్రారంభం నుంచి మహమ్మారి విజృంభిస్తోంది. అన్ని ప్రాంతాలకూ వైరస్ విస్తరించింది. నిత్యం అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. బాధితులు అమాంతం పెరిగిపోతున్నారు. పాజిటివ్ లక్షణాలున్న వారిని కొవిడ్ కేర్ కేంద్రాలకు తరలిస్తున్నారు. తీవ్ర లక్షణాలు ఉన్నవారిని ఆసుపత్రులకు పంపిస్తున్నారు. అయితే ఆసుపత్రుల్లో అందరికీ వైద్యం అందించేందుకు అవసరమైన సౌకర్యాలు లేవు. ఈ క్రమంలో పలువురు బాధితులను హోమ్ ఐసోలేషన్లో ఉంచుతున్నారు. ఈ ప్రక్రియ సత్ఫలితాలివ్వటంతో ఎక్కువమంది మొగ్గు చూపుతున్నారు. ఇలాంటివారి విషయంలో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అన్ని వసతులు ఉంటేనే..!
బాధితుల ఇళ్లలో అన్ని వసతులు ఉంటేనే ఐసోలేషన్కు అనుమతి ఇస్తారు. బాధితులకు తొలుత ఎక్స్రే, ఈసీజీ, రక్త పరీక్షలు చేస్తున్నారు. అనంతరం హోమ్ ఐసోలేషన్లో ఉండేందుకు ఆసక్తి చూపేవారి ఇళ్లను వైద్య సిబ్బంది పరిశీలిస్తారు. ప్రత్యేక పడక గది, బాత్రూమ్ ఉండాలి. రోగి తన కుటుంబ సభ్యులను కలవకుండా వేరుగా ఉండడానికి అన్ని వసతులు ఉన్నాయని నిర్ధరించుకున్నాకే అనుమతిస్తున్నారు.
జాగ్రత్తలు తప్పనిసరి
హోమ్ ఐసొలేషన్లో ఉండే వారికి నిర్దేశించినన్ని రోజులకు సరిపడా మందులు ఒకేసారి ఇస్తారు. ప్రత్యేకంగా కిట్లు ఇస్తున్నారు. ఇవి ఇంకా జిల్లాకు రావాల్సి ఉంది. బాధితుల చరవాణిలో ఆరోగ్యసేతు సహా మరికొన్ని యాప్లు ఇన్స్టాల్ చేస్తున్నారు. వాటిద్వారా పోలీసు, రెవెన్యూ, వైద్య శాఖ అధికారులు నిరంతరం నిఘా ఉంచుతున్నారు. స్థానిక ఏఎన్ఎం, ఆశా కార్యకర్త క్రమం తప్పకుండా వచ్చి బాధితుల ఆరోగ్య పరిస్థితులను పరీక్షిస్తారు. లక్షణాలు తీవ్రమవుతున్నాయని గమనిస్తే వైద్యుల సూచన మేరకు ఆసుపత్రులకు తరలిస్తారు. 14 రోజుల అనంతరం మరోసారి నమూనాలు సేకరించి పరీక్షిస్తారు. నెగిటివ్ వచ్చేవరకు జాగ్రత్తలు తీసుకుంటారు.
వివక్ష తగదు
ఇప్పటికే అనంతపురం, హిందూపురం, ధర్మవరం, కదిరి, యాడికి తదితర ప్రాంతాల్లో కొందరు బాధితులు హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. అయితే ఆయా ప్రాంతాల్లో బాధితుల పట్ల కొందరు స్థానికులు వివక్ష చూపుతున్నారు. ఆ ఇంటివైపు వెళ్లేందుకు భయపడుతున్నారు. బాధితులు ఇంట్లో ఉన్నన్ని రోజులూ చుట్టుపక్కల వారికి ఎలాంటి ప్రమాదమూ లేదని, వదంతులు నమ్మొద్దని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ రోగులు ఎవరైనా బయటకు వస్తుంటే పోలీసు, రెవెన్యూ, వైద్య శాఖల అధికారులకు సమాచారం ఇవ్వొచ్ఛు.
మరింత మెరుగుపడాలి
జిల్లాలో ఇప్పటికే వెయ్యి మందికిపైగా హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. వారి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించాల్సిన వైద్యులు, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు కొన్నిచోట్ల రావడం లేదు. కేవలం ఫోన్ల ద్వారానే విషయం తెలుసుకుంటున్నారు. ప్రతిరోజూ బాధితులను పరీక్షించాలి. విపత్కర పరిస్థితుల్లో వైద్యులు, సిబ్బంది పర్యవేక్షణ ఉంటుందనే నమ్మకం ఉంటేనే బాధితులు హోమ్ ఐసోలేషన్కు వెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు.
అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాం
రోజువారీగా నమోదవుతున్న కేసుల్లో రోగుల ఆరోగ్య పరిస్థితులను పరిశీలిస్తే 85 శాతం మందిని ఇంటి వద్దనే హోమ్ ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందించవచ్చు. 13 శాతం మందిని కొవిడ్ కేర్ కేంద్రాల్లో, మిగిలిన 2 శాతం మందిని మాత్రమే కొవిడ్ ఆసుపత్రులకు తరలించాల్సి వస్తోంది. హోమ్ ఐసోలేషన్లో ఉండే వారి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు సంబంధిత సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. -- గంధం చంద్రుడు, కలెక్టర్
ఇవీ చదవండి:వారమైనా రాని అంబులెన్స్... గాల్లో కలిసిన కరోనా బాధితురాలి ప్రాణం