పహాణీలో నమోదైన వివరాలు సమర్పించాలని పెట్టుకున్న వినతిపత్రం పరిష్కరించాలన్న ఉత్తర్వుల అమలు జాప్యంపై ఉన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశించినప్పటికీ పరిష్కరించేందుకు నాలుగున్నరేళ్ల సమయం ఎందుకని హైకోర్టు ప్రశ్నించింది. సీఎస్ ఇతర విధుల్లో బిజీగా ఉంటే.. రెవెన్యూ శాఖను మరో అధికారికి అప్పగించవచ్చని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
హైకోర్టు ఆదేశాల మేరకు సీఎస్ సోమేశ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా షేక్పేట మండలంలోని 59 ఎకరాల తమ భూమికి సంబంధించి ఖాస్రా పహనీలో నమోదైన వివరాలను సమర్పించాలని ఖుర్షీద్ అలీ తదితరులు గతంలో 2011లో అప్పటి రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శికి వినతిపత్రం సమర్పించారు.
తమ వాదన వినకుండానే వినతిని తిరస్కరించాలని గతంలో హైకోర్టును ఆదేశించారు. వినతిపత్రాన్ని మళ్లీ పరిశీలించి అందరి వాదనలు విని 4 నెలల్లో పరిష్కరించాలని 2016లో కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ధర్మాసనం ఆదేశించినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని పిటిషనర్లు మళ్లీ కోర్టును ఆశ్రయించారు. జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు ఇవాళ పిటిషన్పై విచారణ చేపట్టారు.
చాలా రికార్డులు పరిశీలించాల్సి ఉందని.. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న సీఎస్... కరోనా వంటి అంశాలపై బిజీ ఉన్నందున.. ఆరు నెలల గడువు ఇవ్వాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోరారు. ఆరు నెలల నుంచి కరోనా ఉందని.. అంతకు ముందు నాలుగున్నరేళ్లుగా ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. సీఎస్ బిజీగా ఉంటే రెవెన్యూ శాఖ మరొకరి అప్పగించవచ్చని వ్యాఖ్యానిస్తూ.. 6 వారాల్లో వినతిపత్రాన్ని పరిష్కరించాలని ఆదేశించింది.
ఇదీ చూడండి: పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఓ రబ్బర్ స్టాంప్ : ఆర్. కృష్ణయ్య