మూడు నెలలు రేషన్ తీసుకోలేదన్న కారణంగా రూ.1500 నిలిపి వేయడంలో ఔచిత్యమేంటని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఏ నిబంధన ప్రకారం నిలిపి వేశారని నిలదీసింది. కరోనా విపత్కర పరిస్థితుల్లో పేదలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. 3 నెలలు రేషన్ తీసుకోలేదన్న కారణంగా రూ.1500 సాయం నిలివేశారని హైదరాబాద్కు చెందిన సృజన.. నోటీసులు జారీ చేయకుండా రేషన్ కార్డులను రద్దు చేశారని మసూద్.. గతంలో వేర్వేరుగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు.
గతంలోనే మధ్యంతర ఉత్తర్వులు...
విచారణ జరిపిన హైకోర్టు తెల్లకార్డు ఉన్న వారందరికీ రూ.1500 ఇవ్వాలని.. రద్దు చేసిన రేషన్ కార్డులు పునరుద్ధరించాలని గతంలోనే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేయగా.. హైకోర్టులోనే తేల్చుకోవాలని ఆదేశించింది. ఇవాళ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది.
అంతకంటే అర్హులెవరూ....?
ఆ మూడు నెలలు ఎక్కడికైనా వలస వెళ్లి ఉండొచ్చునని... కరోనా ప్రభావం వల్ల వేల మైళ్లు నడిచి సొంత రాష్ట్రానికి వచ్చి ఉంటారని హైకోర్టు పేర్కొంది. ప్రభుత్వం ఇస్తున్న రూ.1500 సాయం పొందడానికి ఇంతకంటే అర్హులెవరని ప్రశ్నించింది. ఇతర రాష్ట్రాల్లో ఉపాధి లేక సొంత రాష్ట్రానికి వచ్చినందుకు రెండు వైపులా వారు నష్టపోయినట్టేనని వ్యాఖ్యానించింది. తెల్ల కార్డులున్న వారందరికీ.. ఆర్థిక సాయం అందిస్తారో లేదో చెప్పాలంది. రెగ్యులర్ కోర్టు ప్రారంభమైన తర్వాత వాదనలు వినిపిస్తానని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోరగా.. తదుపరి విచారణను వచ్చే నెలకు ధర్మాసనం వాయిదా వేసింది.