జాతీయ విద్యా విధానాన్ని వీలైనంత త్వరగా అమలు చేసేందుకు... రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని గవర్నర్ తమిళిసై కోరారు. తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రాలు పలు అంశాలపై సంకోచిస్తున్నాయన్నారు. జాతీయ విద్యా విధానం-ఉన్నత విద్యా బలోపేతంపై ఓయూలో జరుగుతున్న సదస్సుకు హాజరైన గవర్నర్... విశ్వవిద్యాలయాల్లో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలు వెంటనే చేపట్టాలని సూచించారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం భారత్ను విశ్వగురువుగా నిలబెడుతుందని గవర్నర్ తమిళిసై అభిప్రాయపడ్డారు. రాష్ట్రాలు ఇందుకు సహకరించాలని కోరారు. 'జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఉన్నత విద్య బలోపేతం' అనే అంశంపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరుగుతున్న సదస్సుకు తమిళిసై ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాఠ్యపుస్తకాల ప్రచురణ వంటి విషయాల్లో రాష్ట్రాలకే స్వేచ్ఛ ఉంటుందన్నారు. జాతీయ విద్యా విధానం అమలు చేయాలని ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు గవర్నర్ తెలిపారు.
'విశ్వవిద్యాలయాల్లో బోధన, బోధనేతర సిబ్బందిని వెంటనే నియమించాల్సిన అవసరం ఉంది. వీలైనంత త్వరగా భర్తీ ప్రక్రియ చేపట్టాలని ఉపకులపతులను కోరుతున్నాను. ఎంత గొప్ప విద్యా విధానం ఉన్నప్పటికీ అధ్యాపకులు లేకపోతే అమలు కాలేదు. ఇప్పటికే తెలంగాణ విద్యారంగంలో పురోగమిస్తోంది. మరింత ముందుకు వెళ్లేందుకు జాతీయ విద్యా విధానం అమలుకు చర్యలు తీసుకోవాలి.'
- తమిళిసై సౌందరరాజన్, గవర్నర్
జాతీయ విద్యా విధానం స్ఫూర్తిని... ఉన్నత విద్యలో అమలు చేస్తున్నామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. రాష్ట్రంలో క్లస్టర్, బకెట్ విధానం అనుసరిస్తున్నామన్నారు. ఉన్నత విద్యకు సంబంధించిన విధానాల్లో.. రాష్ట్రాలను భాగస్వాములను చేయాల్సిన రాజ్యాంగపరమైన బాధ్యత కేంద్రానికి ఉందన్నారు.
'కృత్రిమ మేథ, మిషన్ లెర్నింగ్ వంటి కోర్సుల గురించి ప్రస్తుతం బాగా మాట్లాడుతున్నారు. రెండు విద్యా సంవత్సరాలుగా 24 వేల మంది విద్యార్థులు ఆయా కోర్సుల్లో చేరేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. జాతీయ విద్యా విధానం స్ఫూర్తితో.. రాబోయే రోజుల్లో ప్రపంచంలోని విద్యార్థులకు తెలంగాణ కేంద్రంగా నిలవనుంది.'
-ఆచార్య ఎస్.అనిల్, ఏఐసీటీఈ ఛైర్మన్
ప్రత్యక్ష బోధన కొవిడ్ వల్ల ఆన్లైన్కు మారింది. భవిష్యత్తులో ప్రత్యక్ష, ఆన్లైన్ బోధన రెండు కలిపి నిర్వహించాల్సి ఉంటుంది. ఇప్పటికే చాలా విశ్వవిద్యాలయాలు ఆన్లైన్ బోధనలో పలు కోర్సులను అందిస్తున్నాయి. ఆన్లైన్ బోధనతో విద్య అందరికీ మరింత అందుబాటులోకి వస్తుంది. 'జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఉన్నత విద్య బలోపేతం' అనే అంశంపై ఓయూలో జరుగుతున్న సదస్సు ఇవాళ ముగియనుంది.
అమ్మాయిల వివాహ పెంచినందుకు ధన్యవాదాలు
Governor on womens: దేశవ్యాప్తంగా అమ్మాయిల పెళ్లి వయసు 21 ఏళ్లు చేసినందుకు కేంద్రానికి గవర్నర్ ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మహిళల సాధికారతకు ఎంతగానో తోడ్పడుతుందని గవర్నర్ తమిళిసై అన్నారు.