రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై కేంద్ర మంత్రి చార్జీ షీట్ విడుదల చేశారే కాని చర్యలు తీసుకోవడంలేదని ఏఐసీసీ కార్యదర్శి మధుయాస్కీ ఆక్షేపించారు. లాక్డౌన్ సమయంలో పేదలను గాలికొదిలేసిన ప్రధాని మోదీ... ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ పరిశీలన కోసం వస్తున్నారని దుయ్యబట్టారు.
కరోనా సెకండ్ వేవ్ను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కరోనాను అరికట్టడంలోనూ కేసీఆర్ విఫలమయ్యారని ఆరోపించారు. గ్రేటర్లో 15వేల పోస్టర్లు వేయడానికి సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందో కేసీఆర్ చెప్పాలన్నారు. భాజపా, ఎంఐఎం మతాన్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకునేందుకు ప్రణాళిక చేస్తున్నాయని మండిపడ్డారు.
కాంగ్రెస్ అన్ని వర్గాలను కాపాడుకుంటుందని ఆయన పేర్కొన్నారు. అధికారులు భాజపా, తెరాస ప్రచారకర్తలుగా మారారని ఆరోపించారు. అల్లర్లపై పూర్తి సమాచారం ఉంటే ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. విభజన చట్టం ప్రకారం శాంతిభద్రతలపై గవర్నర్ దృష్టి పెట్టాలని కోరారు.
ఇదీ చదవండి: గల్లీ స్థాయి ఎన్నికల కోసం దిల్లీ స్థాయి నేతలంతా క్యూ: కేటీఆర్