ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లాలోని రామతీర్థం రామచంద్రస్వామి ఆలయ పునరుద్దరణ కోసం రూ.3కోట్లు కేటాయించినట్లు ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. విజయవాడలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. 700 అడుగుల ఎత్తులో ఉన్న ఆలయ నిర్మాణం పూర్తి రాతి కట్టడాలతో జరగనున్నట్లు వెల్లడించారు. కోదండ రాముడి విగ్రహాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తయారు చేసి అందజేస్తుందని... అలాగే రామతీర్థం మెట్ల మార్గం సరిచేయడం పాటుగా కొత్త మెట్లను నిర్మిస్తామని వివరించారు. దేవాలయ పరిసరాల విద్యుత్ దీపాలంకరణ చేయడం, శాశ్వత నీటి వసతి, కోనేటిని శుభ్రపరచడం... కోనేరుకు గ్రిల్స్ ఏర్పాటు చేయడం, ప్రాకార నిర్మాణం, హోమశాల, నివేదనశాల నిర్మాణాలూ పూర్తి చేయనున్నట్లు తెలిపారు.
అలాగే ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలతో భక్తుల మనోభావాలకు అనుగుణంగా తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కల్యాణానికి ముందే కొత్త రథాన్ని సిద్ధం చేశామని చెప్పారు. ఫిబ్రవరిలో మూడు రోజుల పాటు నూతన రథానికి వైఖాస ఆగమ సంప్రదాయం ప్రకారం సంప్రోక్షణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 11న సంకల్పం, 12న ఆదివాసం, 13న అభిషేకం, పూర్ణాహుతి, రథ ప్రతిష్ఠ జరుగుతుందని వివరించారు. 22న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణం అనంతరం 23న కల్యాణోత్సవ రథం ఊరేగింపు కనుల పండువగా జరపాలని భావిస్తున్నామని అన్నారు.
అధికారులతో సమీక్ష అనంతరం అర్చక సమాఖ్య ప్రతినిధులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఏపీ సీఎం ఆదేశాలతో అర్చక వారసత్వ హక్కుల ప్రకారం అర్చకత్వం కొనసాగించేందుకు చర్యలు చేపడతామని వెల్లడించారు. కనీస ఆదాయం లేని దేవాలయాలకు అర్చక గౌరవ వేతనం రూ.5 వేల నుంచి10 వేలకు పెంచడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. రూ.10 వేలు ఉన్న భృతిని రూ.16,500లకు పెంచుతామని, ధూపదీప నైవేద్య పథకానికి రూ.3,600 వర్తించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. డీడీఎస్ స్కీమ్ కింద ఇస్తున్న రూ.5వేల వేతనాన్ని రూ.10 వేలకు పెంచుతామని వెల్లడించారు.
ఇదీ చదవండి: కాళేశ్వరంలో కేసీఆర్... గోదారి జలాలతో అభిషేకం