హైదరాబాద్ ఐటీ కారిడార్లో సాధారణ పరిస్థితులు ఉన్నాయని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో ఐటీ కంపెనీల ప్రతినిధులతో సీపీ సమావేశమై కరోనా ప్రభావంపై చర్చించారు. కొవిడ్-19 వ్యాప్తిపై పుకార్ల వల్ల ఐటీ గ్రోత్తో పాటు.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే అవకాశం ఉందన్నారు. ఇది దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని సీపీ సూచించారు.
ఓ ఐటీ కంపెనీలోని ఉద్యోగికి కరోనా పాజిటివ్ వార్తలతో ఐటీ కారిడార్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయని.. తర్వాత అటువంటిదేమీ లేదని తేలిందన్నారు. కరోనా వార్తల్లో కంపెనీలు, వ్యక్తుల పేర్లు వెల్లడించవద్దని సూచించారు. వైరస్ నియంత్రణ, అవగాహనకు తమ కంపెనీలు చర్యలు తీసుకుంటున్నాయని ఐటీ కంపెనీల ప్రతినిధులు పేర్కొన్నారు. విదేశాల నుంచి వచ్చే ఉద్యోగులను మానిటర్ చేస్తున్నామని... వారిని 2 వారాల పాటు ఇంట్లోనే పనిచేసుకునే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు.
ఇదీ చూడండి : రాష్ట్రంలోకి కరోనా రానివ్వం: కేసీఆర్