కరోనాపై అవగాహన కల్పించేందుకు సైబరాబాద్ సీపీ సజ్జనార్ పోస్టర్ను విడుదల చేశారు. వ్యాధి లక్షణాలు కనపడితే తీసుకోవాల్సిన చర్యలపై పోస్టర్లో పొందుపరిచారు. ప్రస్తుతం తెలంగాణలో పరిస్థితి సాధారణంగా ఉందని సీపీ స్పష్టం చేశారు. దుబాయ్ నుంచి వచ్చిన ఒక వ్యక్తికి తప్ప ఎవరికీ వైరస్ రాలేదని వెల్లడించారు. ఈ వారం నుంచి ఐటీ ఉద్యోగులు అందరూ ఆఫీస్లకు వచ్చి పనిచేస్తున్నారని సీపీ పేర్కొన్నారు. గత వారం కరోనా వైరస్పై ఒక కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఐటీ పరిశ్రమ కోసం న్యాస్కామ్, ఎస్సీఎస్సీ ఆధ్వర్యంలో నియమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వాలెంటరీ టాస్క్ఫోర్స్తోపాటు కరోనా కోసం ఏర్పాటు చేసిన కో ఆర్డినేషన్ కమిటీ 24 గంటలు పనిచేస్తుందన్నారు.
ఇంటి నుంచే పనిచేయాలి
విదేశాల నుంచి వచ్చిన ఉద్యోగులకి లక్షణాలుంటే 14రోజులపాటు ఇంటి నుంచే పనిచేయాలని ఐటీ ప్రతినిధులు స్పష్టం చేశారు. చైనా, ఇటలీ ఇతర దేశాల నుంచి వచ్చే వారు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఆఫీసు నుంచి వెళ్లిన వెంటనే చేతులు కడుక్కోవాలని ఐటీ ప్రతినిధులకు తెలిపారు.
ఇవీ చూడండి: పోరు దిశగా కాంగ్రెస్... నిలువరించే పనిలో తెరాస