హైదరాబాద్ సాహెబ్ నగర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెరాస, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నిన్న రాత్రి సాహెబ్నగర్లోని ఓ డ్రైనేజీని శుభ్రం చేసేందుకు వెళ్లిన ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు.. లోపల ఊపిరాడక మృత్యువాత పడ్డారు. ఒకరి మృతదేహం లభ్యం కాగా.. గల్లంతైన మరొక కార్మికుడి కోసం గాలింపు కొనసాగుతోంది.
ఒక కార్మికుడి మృతదేహం లభ్యమవడంతో.... అక్కడి పరిస్థితిని పరిశీలించేందుకు ఎల్బీనగర్ తెరాస ఎమ్మెల్యే సుధీర్రెడ్డి వెళ్లారు. ఆయనను అడ్డుకునేందుకు కాంగ్రెస్ శ్రేణులు యత్నించడంతో... కాసేపు అక్కడ గందరగోళం నెలకొంది.
నిన్న రాత్రి డ్రైనేజీ శుభ్రం చేయాలంటూ ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు అంజయ్య, శివలకు పిలుపు రావడంతో వారు అక్కడికి వెళ్లారు. శుభ్రం చేస్తుండగా లోపల ఊపిరాడక ఇద్దరూ మృతి చెందారు. మృతులు చంపాపేట్, సరూర్నగర్లకు చెందిన వారు కాగా.. రాత్రివేళల్లో ఇలాంటి పనులు చెబుతున్న కాంట్రాక్టర్లపై స్థానిక ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: GHMC: మ్యాన్హోల్లోకి దిగి ఇద్దరి గల్లంతు.. ఒకరి మృతదేహం లభ్యం