శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో సహచర ఉద్యోగులు ప్రాణాలు కోల్పోవడం పట్ల జెన్ కో- ట్రాన్స్ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి సంబంధించి సమాచారం తెలుసుకున్న వెంటనే ప్రభాకర్ రావు అర్థరాత్రి సమయంలో హైదరాబాద్ నుంచి శ్రీశైలం బయలు దేరి వెళ్లారు. ప్లాంటులో చిక్కుకున్న వారిని ఎలాగైనా ప్రాణాలతో బయటకు తీసుకురావడానికి విశ్వ ప్రయత్నం చేశామన్నారు. ఎన్.డి.ఆర్.ఎఫ్, సింగరేణి, ఫైర్, పోలీస్, వైద్య ఆరోగ్య తదితర శాఖలను రంగంలోకి దింపామని తెలిపారు. తక్షణమే ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్కు, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డికి సమాచారం అందించామని పేర్కొన్నారు. రాత్రంతా ప్లాంటు వద్దే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించినప్పటికీ సహచరులను విగత జీవులుగా చూడాల్సి రావడం విచారకరమని కన్నీటి పర్యంత మయ్యారు. ఈ దురదృష్టకరమైన సంఘటన తనకెంతో బాధను, దుఃఖాన్ని కలిగించిందన్నారు. తన సుదీర్ఘ అనుభవంలో ఇంతటి విషాద ఘటన మరొకటి లేదన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సహచరుల త్యాగం ఎన్నటికీ మరువలేనిదన్నారు. మంటలు ఎగిసి పడుతున్నప్పటికీ, ప్రాణాలకు ముప్పు అని తెలిసినప్పటికీ వారు ప్లాంటును కాపాడడానికి సాహసోపేత ప్రయత్నం చేసి అంకితభావం చాటుకున్నారని కొనియాడారు. విద్యుత్ ఉద్యోగులు జాతి సంపద కాపాడడం కోసం ప్రయత్నించి, వీర మరణం పొందారన్నారు.
ప్రజలకు నిరంతరం విద్యుత్ వెలుగులు అందించడానికి విద్యుత్ ఉద్యోగులు రేయింబవళ్లు, ప్రమాదరకరమైన పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తారనే విషయం ఈ దుర్ఘటన ద్వారా మరోసారి తేటతెల్లమయిందని చెప్పారు. యావత్ సమాజం విద్యుత్ ఉద్యోగులకు అండగా నిలవాలని ఆయన అభ్యర్థించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వ పరంగా చేయాల్సిందంతా చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు సీఎండీ ప్రకటించారు.
ఇదీ చూడండి: 'దట్టమైన పొగల వల్లే లోనికి వెళ్లడం కష్టమవుతోంది'