హైదరాబాద్లోని గాజుల పరిశ్రమల్లో పనిచేస్తున్న బాలకార్మికులకు రాచకొండ పోలీసులు, బాలల సంరక్షణ, డీసీపీయూ అధికారులు విముక్తి కలిగించారు. కమిషనరేట్ పరిధిలోని ఎర్రకుంట, బాలాపూర్ మండలాల్లో బాల కార్మికులతో గాజుల పరిశ్రమలో పనిచేయించుకుంటున్నారని ఫిర్యాదులు రావడంతో పోలీసులు, అధికారులతో కలిసి పరిశ్రమలపై దాడులు నిర్వహించారు. మొత్తం 19 మంది బాల కార్మికులు గాజుల పరిశ్రమల్లో పనిచేస్తున్నట్టు గుర్తించారు.
వీరంతా బిహార్కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వారితో పని చేయిస్తున్న పరిశ్రమల యజమానులు మహ్మద్ తఫౌకి, సర్ఫరాజ్, మాజాహిద్, ఇంతియాజ్, మనో దేవిని పోలీసులు అరెస్టు చేశారు. బాలకార్మికులను పోలీసులు బిహార్లోని తల్లిదండ్రులకు అప్పగించేందుకు రైలులో తీసుకెళ్లారు. బాలుర సంక్షేమ అధికారులు వారికి మాస్కులు, శానిటైజర్లు అందజేశారు. బాల కార్మికులతో పరిశ్రమల్లో పనిచేయించుకుంటే కఠిన చర్యలు తప్పవని రాచకొండ పోలీసులు హెచ్చరించారు.