BJP MLA Candidates Final List Telangana 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాన పార్టీలన్నీ దాదాపుగా అభ్యర్థులను ప్రకటించాయి. బీఆర్ఎస్ 119 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్ పార్టీ 118 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించింది. పొత్తు నేపథ్యంలో మరో స్థానం సీపీఐకి కేటాయించింది. మరోవైపు బీజేపీ ఇప్పటి వరకు 100 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. పొత్తు నేపథ్యంలో మరో 8 స్థానాలను జనసేనకు కేటాయించింది. ఇక మిగతా 11 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండగా.. ఈ స్థానాలతో పాటు మరో 3 చోట్ల అభ్యర్థులను మార్చి.. మొత్తం 14 స్థానాలతో బీజేపీ తుది జాబితాను విడుదల చేసింది. ఇందులో చాంద్రాయణగుట్ట, బెల్లంపల్లి, వనపర్తి అభ్యర్థులను మార్చింది.
బీజేపీ విడుదల చేసిన తుది జాబితా అభ్యర్థుల వివరాలు :
- బెల్లంపల్లి - కొయ్యల ఎమాజీ
- పెద్దపల్లి-దుగ్యాల ప్రదీప్
- సంగారెడ్డి - దేశ్పాండే రాజేశ్వరరావు
- మేడ్చల్-ఏనుగు సుదర్శన్ రెడ్డి
- మల్కాజ్గిరి-ఎన్.రామచంద్రరావు
- శేరిలింగంపల్లి-రవికుమార్ యాదవ్
- నాంపల్లి-రాహుల్ చంద్ర
- చాంద్రాయణగుట్ట-కె.మహేందర్
- సికింద్రాబాద్ కంటోన్మెంట్- గణేశ్ నారాయణ్
- దేవరకద్ర-ప్రశాంత్ రెడ్డి
- వనపర్తి-అనుజ్ఞా రెడ్డి
- అలంపూర్- మేరమ్మ
- నర్సంపేట- పుల్లారావు
- మధిర – విజయరాజు
BJP MLA Tickets Issues in Telangana : మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసేందుకు ఆసక్తి చూపి సీటు దక్కకపోవడంతో.. అసంతృప్తితో ఉన్న నేతలను బుజ్జగించే పనిలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నిమగ్నమైంది. ఇప్పటికే కొందరు నాయకులు పార్టీని వీడగా.. టికెట్ దక్కని నేతల తీరు పార్టీకి సంకట పరిస్థితిని తెచ్చిపెట్టడంతో బీజేపీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇన్ని రోజులు అసంతృప్తులని పెద్దగా పట్టించుకోని కాషాయ పార్టీ.. క్రమంగా ఒక్కొక్కరిని బుజ్జగిస్తోంది. వారిని దారికి తెచ్చుకోకుంటే ఎన్నికల్లో తీవ్ర నష్టం తప్పదని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది.
బీజేపీలో అసమ్మతి జ్వాల - అసంతృప్తులను బుజ్జగించే పనిలో రాష్ట్ర నాయకత్వం
Telangana Assembly Elections 2023 : ఇటీవల బీజేపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో.. కొందరు పార్టీ జిల్లా అధ్యక్షులకు టికెట్ దక్కింది. అయితే పార్టీ కోసం కష్టపడిన ఇతర నేతలు టికెట్ ఆశించారు. దీంతో జిల్లా అధ్యక్షులకు రావడంతో కినుకు వహించారు. గుర్తింపు లేదంటూ అలకబూనిన వారికి బాధ్యతలు కట్టబెట్టాలని.. కమలం పార్టీ భావించింది. జిల్లా అధ్యక్షులకు టికెట్ కేటాయించిన చోట.. స్థానిక ముఖ్య నేతలకు సమన్వయ బాధ్యతలు అప్పగించారు.
కొత్తగూడెం స్థానం ఆశించిన రంగాకిరణ్కి జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించి శాంతింపజేశారు. కాగా టికెట్ ఆశించి దక్కని వారందరికి ఫోన్లు చేయాలని.. రాష్ట్ర ప్రధాన కార్యదర్శులను కిషన్రెడ్డి ఆదేశించినట్లు సమాచారం. సమస్యలకు పరిష్కారం చూపించి ఎన్నికలకు వెళ్లాలని దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. కొన్ని చోట్ల టికెట్ వస్తుందని భావించిన నేతలు.. ఆర్థికంగా నష్టపోయినట్లు తెలిసింది. మరి వారిని పార్టీ ఎలా బుజ్జగిస్తుందనేది వేచి చూడాల్సిందే.