దేవాలయ ప్రాంగణాల్లో వినాయక విగ్రహాలు పెట్టి పూజలు చేసుకోమనడం, గణేష్ ఉత్సవాలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వం ప్రదర్శిస్తున్న వైఖరి సరికాదంటూ గ్రేటర్ హైదరాబాద్ భాజపా ఉపాధ్యక్షులు బండపల్లి సతీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరుకైన గుళ్లలో విగ్రహాలు పెట్టి పూజలు చేస్తే.. భక్తుల రద్దీ పెరిగి.. భౌతిక దూరం పాటించడానికి వీలు లేకుండా ఇబ్బందులు తలెత్తవా అని ప్రశ్నించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు చేసుకుంటామంటే ప్రభుత్వం ఎందుకు అడ్డు చెప్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు.
చిలుకలగూడ మున్సిపల్ మైదానంలో ఎప్పట్లాగే మండపం ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తామంటే ప్రభుత్వం, పోలీసులు అనుమతి ఇవ్వకుండా మైదానం గేటుకు తాళం వేయడం సరికాదన్నారు. 11రోజుల పాటు నిర్వహించే పూజలను సైతం ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా 3 రోజులకు కుదించి చేసుకుంటాం అని అభ్యర్థించినా ప్రభుత్వం అనుమతులు ఇవ్వకపోవడం వెనుక మతలబేంటని ప్రశ్నించారు. బక్రీద్ సందర్భంగా చిలుకలగూడ మైదానంలో ప్రభుత్వం, జీహెచ్ఎంసీ అధికారులు షెడ్లు ఏర్పాటు చేసి మరీ మేకలు, గొర్లను అమ్ముకోడానికి అనుమతి ఇచ్చారు. నేడు బతుకుదెరువు కోసం రోడ్లపై వినాయక ప్రతిమలు అమ్మే వారిపై బెదిరింపులకు దిగడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి పద్మారావు గౌడ్ కూడా ఒక వర్గం వారికి అనుకూలంగా మాట్లాడడం సరికాదని ఆరోపించారు.
మైదానం గేటుకు తాళం వేసి చుట్టూ పోలీసులను పెట్టి భక్తులను భయబ్రాంతులకు గురిచేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వర్గానికి సకల సౌకర్యాలు కల్పించి.. మరో వర్గం వారి పండగలకు ఆటంకాలు సృష్టించడం, కేసులు నమోదు చేస్తామని బెదిరించడం ప్రజాస్వామ్యంలో సరైన పద్ధతి కాదన్నారు. కేసులు పెట్టినా, బెదిరించినా, భయపెట్టినా వినాయక మండపాలు ఏర్పాటు చేసి విగ్రహాలు పెట్టి పూజలు చేస్తామని, హిందువులందరూ నిర్భయంగా మండపాల్లో విగ్రహాలు పెట్టి పూజలు చేయాలని, భాజపా, బీజైవైఎం అండగా ఉంటుందని తెలిపారు. పోలీసులు ప్రభుత్వం ఘర్షణ వైఖరి విడనాడాలని, ఎట్టి పరిస్థితుల్లో మండపాలు ఏర్పాటు చేసి పూజలు చేస్తామని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాశ్ తెలిపారు. వినాయక మండపాలు ఏర్పాటు చేసి పూజలు 3రోజుల పాటు చేసుకుంటాము. పోలీసులకు కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు.