తెలంగాణ వస్తే లక్ష ఉద్యోగాలిస్తానన్న సీఎం కేసీఆర్... ఎన్ని ఉద్యోగాలిచ్చారని భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ప్రశ్నించారు. ఏడు లక్షల ఇళ్లు నిర్మిస్తానని ఎన్నికల సమయంలో వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి... 50వేల ఇళ్లు కూడా కట్టలేదని విమర్శించారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అవినీతిలో కూరుకుపోయిందని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఘాటుగా విమర్శించారు. భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయాలకు వర్చువల్ వేదికగా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భూమి పూజ నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్ గ్రామీణ, రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, వనపర్తి, నారాయణపేట, వికారాబాద్ జిల్లా కార్యాలయాలకు శంకుస్థాపన చేశారు.
కేసీఆర్ నిద్రపోతున్నారు...
సుమారు రూ.45 వేల కోట్లతో పూర్తి కావాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టును దోచుకోవడం కోసమే రూ.85 వేల కోట్లకు పెంచారని మండిపడ్డారు. గడిచిన ఆరేళ్లుగా తెలంగాణ ప్రజలకు కేసీఆర్ చేసిందేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. కరోనాను కట్టడి చేయకుండా సీఎం కేసీఆర్ కుంభకర్ణుడిలా నిద్రపోతున్నారని దుయ్యబట్టారు. హైకోర్టు మొట్టికాయలు వేసినా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వీడట్లేదన్నారు. కొవిడ్ పరీక్షల నిర్వహణలో తెలంగాణ వెనుకబడిపోయిందని నడ్డా ఆందోళన వ్యక్తం చేశారు.
కార్యకర్తలు కష్టపడితే అధికారంలోకి రావొచ్చు...
లోక్సభ ఎన్నికల మాదిరిగానే... వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ తెలంగాణ ప్రజలు కేసీఆర్కు బుద్ధి చెప్పాలని కోరారు. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయకపోవడం వల్ల 98 లక్షల మంది బీమా సౌకర్యాన్ని కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చే అనుకూలత భాజపాకు ఉందని నడ్డా అభిప్రాయం వ్యక్తం చేశారు. కార్యకర్తలంతా సమష్టిగా కృషిచేస్తే అధికారంలోకి రావొచ్చునని స్పష్టం చేశారు.
'అవి సంఘ విద్రోహ శక్తులకు అడ్డ'
కొవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రధాని మోదీ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారని గుర్తు చేశారు. కరోనా వైరస్ను ఎదుర్కొనే క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి దేశ ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యకర్తల కోసం ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయం ఉండాలనేది ప్రధాని మోదీ ఆలోచన అని... ఆయన ఆశయం మేరకే పార్టీ కార్యాలయాల నిర్మాణం చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. ఎంఐఎం, కమ్యూనిస్టు పార్టీ కార్యాలయాలు ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తులకు అడ్డాగా మారాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తూర్పరబట్టారు. తెరాస కార్యాలయం కల్వకుంట్ల కుటుంబం ఆస్తిగా మిగిలిపోతుందని ఆరోపించారు. ఒక్క భాజపా కార్యాలయాలు మాత్రమే దేశహితం కోసం, దేశ భక్తుల కోసమని స్పష్టం చేశారు.
అక్రమ కేసులు బనాయిస్తున్నారు...
భాజపా కార్యకర్తలపై ముఖ్యమంత్రి కేసీఆర్ అక్రమ కేసులు బనాయిస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కేసీఆర్ పూర్తిగా విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలన్న కేసీఆర్... నీళ్లను ఫామ్ హౌస్కు, పదవులు కుటుంబానికి కట్టబెట్టుకున్నాడని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య తెలంగాణ కోసం ప్రతి భాజపా కార్యకర్త ఉద్యమించాలని సంజయ్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ప్రేమేందర్ రెడ్డి, తొమ్మిది జిల్లాల అధ్యక్షులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి.
ఇవీ చూడండి : కేంద్రం మేము అడిగిన నిధులు ఇవ్వలేదు: ఎర్రబెల్లి