హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవాలు సోమవారం నుంచి 3 రోజుల పాటు నిర్వహించడానికి దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. సోమవారం సాయంత్రం 5 గంటలకు మహాగణపతి పూజ, పుణ్యాహవాచనం, కలశస్థాపన, దేవతాహ్వానం, అంకురార్పణ, గంగతెప్ప తదితర పూజలతో వేడుకలు ప్రారంభం కానున్నాయి.
రెండో రోజైన మంగళవారం ఎల్లమ్మ తల్లి కల్యాణాన్ని ఆలయం లోపల మండపంలో వేదపండితులు నిర్వహించనున్నారు. బుధవారం అమ్మవారి రథోత్సవం దేవాలయం లోపలే నిర్వహిస్తారు. ఈ మూడు రోజులూ భక్తులకు అనుమతి లేదు. లక్షలాది మంది భక్తుల సమక్షంలో వైభవంగా జరగాల్సిన ఎల్లమ్మ కల్యాణం కరోనా వైరస్ కారణంగా ఆలయం లోపలే నిర్వహించాలని దేవాదాయశాఖ నిర్ణయం తీసుకుంది.
ఈ సందర్భంగా ఆలయాన్ని విద్యుత్తు దీపాలు, పూలు, రంగులతో సుందరంగా అలంకరించారు. అమ్మవారి దర్శనం కోసం ఈ మూడు రోజులూ భక్తులెవరూ దేవాలయం వద్దకు రావద్దని, దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇబ్బందులు పడొద్దని ఈఓ కుంట నాగరాజు, ఛైర్మన్ కొత్తపల్లి సాయిబాబాగౌడ్ సూచించారు.
ఇవీ చూడండి: మందు లేని మాయదారి రోగం కరోనా.. అంటూ పాటతో అవగాహన