దళిత సాధికారిత పథకాన్ని కొత్తగా ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ప్రారంభించడం సంతోషంగా ఉందని ప్రభుత్వ విప్లు బాల్క సుమన్, గువ్వల బాలరాజు అన్నారు. ఆదివారం ప్రగతిభవన్లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో అన్ని అంశాలపై కూలంకషంగా చర్చించినట్లు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 11,500 దళిత కుటుంబాలకు రూ.12 వందల కోట్లు ఖర్చు పెడుతున్నామని బాల్క సుమన్ వెల్లడించారు. అసెంబ్లీ ప్రాంగణంలోని తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో ప్రభుత్వ విప్లు మాట్లాడారు.
దళితులపై దాడులను అరికట్టేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించినట్లు బాల్క సుమన్ తెలిపారు. భూములు లేని దళిత రైతులకూ రైతు బీమా అమలు చేయాలని సీఎం కేసీఆర్ గొప్ప నిర్ణయం తీసుకున్నారన్నారు. ఈ మేరకు దళిత కుటుంబాల సమగ్ర సర్వే చేసి లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని స్పష్టం చేశారు.
కేసీఆర్ను దేవుడిలా చూస్తున్నారు..
రాష్ట్రమంతా సీఎం కేసీఆర్ను దేవుడిలా చూస్తోందని మరో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు తెలిపారు. కేసీఆర్ మాదిరిగా ఏ ముఖ్యమంత్రులూ ఆలోచించలేదని అన్నారు. కార్యక్రమంలో ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ రాజేశ్వర్రావు, ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్, నోముల భగత్లు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: Telangana: రూ.1,86,035.60 కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక