రాష్ట్రంలో ఆసరా పింఛన్లు ఇప్పటి మాదిరిగానే తపాలా సిబ్బంది, బ్యాంకుల ద్వారా పంపిణీ కానున్నాయి. గ్రామాలకు దూరంగా ఉండే బ్యాంకులకు వెళ్లి పింఛన్లు తీసుకోవడం లక్షల మంది వృద్ధులు, దివ్యాంగులకు సులువుకాదనే భావనతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. నగరాలు, పట్టణాలు, కొద్దిపాటి గ్రామీణ ప్రాంతాల లబ్ధిదారులు మాత్రమే ప్రస్తుతం బ్యాంకుల ద్వారా పింఛను అందుకుంటున్నారు. మిగతా గ్రామీణ ప్రాంతాల వారందరికీ.. తపాలా సిబ్బందే గ్రామాలకు వెళ్లి పింఛన్లు అందజేస్తున్నారు. బయోమెట్రిక్ పరికరాలను గ్రామాలకు తీసుకెళ్లి.. లబ్ధిదారుల వేలిముద్రలను నమోదు చేసి నగదు ఇస్తున్నారు. ఈ సేవలకుగానూ తపాలాశాఖకు ప్రభుత్వం కొంత కమీషన్ చెల్లిస్తోంది.
ప్రస్తుత విధానంలో సమస్యలు
తపాలా సిబ్బంది ప్రతి నెలా గ్రామాలకు వెళ్లి పింఛన్లు అందజేయాలంటే ఆర్థిక శాఖ ఎప్పటికప్పుడు ఆర్బీఐతో మాట్లాడి నగదును సిద్ధం చేయాల్సి ఉంటుంది. నగదు సమస్యతో ఒక్కోసారి పింఛన్ల చెల్లింపుల్లో జాప్యం అనివార్యమవుతోంది. బయోమెట్రిక్ పరికరాలకు గ్రామాల్లో సిగ్నల్ అందకపోవడం, రేఖలు అరిగిపోయి వృద్ధుల వేలిముద్రలను బయోమెట్రిక్ పరికరాలు స్వీకరించకపోవటం వంటి సమస్యలూ ఉన్నాయి.
వృద్ధుల ఇబ్బందుల దృష్ట్యా
గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది ఇప్పటికీ బ్యాంకులు, ఏటీఎంలు లేవు. ఈ నేపథ్యంలో అందరినీ బ్యాంకులకు మళ్లిస్తే సమస్యలు ఉత్పన్నమవుతాయని అధికార యంత్రాంగం భావిస్తోంది. ప్రస్తుత విధానమే ఉత్తమమనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. వృద్ధాప్య పింఛను వయోపరిమితిని కుదించటం వల్ల కొత్తగా ఆసరా పరిధిలోకి వచ్చే దాదాపు 7 లక్షల మందిలో గ్రామీణ ప్రాంతాల వారికి కూడా తపాలా సిబ్బంది ద్వారానే పింఛన్లు అందజేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం ఆసరా లబ్ధిదారులు 39 లక్షలు ఉన్నారు. బ్యాంకుల ద్వారా పింఛన్లు పొందుతున్నవారు 44 శాతం, తపాలా సిబ్బంది ద్వారా ఊరిలోనే 56 శాతం తీసుకుంటున్నారు.
ఇదీ చూడండి : ఈడీ ట్రైబ్యునల్లో జగన్మోహన్ రెడ్డికి ఊరట