దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల సెమిస్టర్ పరీక్షల నిర్వహణపై యూజీసీ ఇటీవల నిపుణుల కమిటీని నియమించింది. ఆ నివేదిక వచ్చిన తర్వాత యూజీసీ, ఏఐసీటీఈ మార్గదర్శకాల ప్రకారం పరీక్షలను నిర్వహించాలని జేఎన్టీయూహెచ్ భావిస్తోంది. గవర్నర్ ఆదేశాల మేరకు ఆన్లైన్ బోధనకు పాటించాల్సిన నిబంధనలపై విశ్వవిద్యాలయం ఈనెల 10న కళాశాలలకు ఆదేశాలిచ్చింది.
సిలబస్ పూర్తి కావడానికి మరో వారం పట్టొచ్చు..
ఏప్రిల్ నెలాఖరు కల్లా సిలబస్ పూర్తిచేయాలని కళాశాలలను తాజాగా ఆదేశించినా..మరో వారం అదనంగా పట్టొచ్చని ఆచార్యులు భావిస్తున్నారు. మార్చి 24 నుంచి ఏప్రిల్ 10 వరకు ఆన్లైన్ తరగతులు జరగలేదు. ఆ రోజులను మినహాయిస్తే మే 10వ తేదీకి నిబంధనల ప్రకారం 16 వారాల బోధన పూర్తవుతుందని వర్సిటీ అధికారులు చెబుతున్నారు.
ఉన్నత విద్యామండలి సూచనల మేరకు
యూజీసీ కమిటీ నివేదిక అనంతరం రాష్ట్ర ఉన్నత విద్యామండలి సూచనల మేరకు పరీక్షలపై తుది నిర్ణయం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. తొలుత బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ చివరి సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తే చాలని, మిగిలిన విద్యార్థుల పరీక్షలపై తొందరేమీ లేదని వర్సిటీ అధికారి ఒకరు తెలిపారు. పరిస్థితులను చూస్తుంటే మాత్రం పరీక్షలు ఈ సారి ఆలస్యం కావొచ్చని అంచనా వేస్తున్నారు. జేఎన్టీయూహెచ్ పరిధిలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు 50 వేల మంది వరకు ఉంటారు.
ఆన్లైన్ పరీక్షలు వద్దు
యూజీసీ నియమించిన కమిటీ ఆన్లైన్ పరీక్షల నిర్వహణకు సుముఖంగా లేదని తెలిసింది. ఇళ్లలో ఉండి పరీక్షలు రాస్తారు కాబట్టి కాపీయింగ్ను నిరోధించలేమని భావిస్తోంది. చాలా వర్సిటీలకు ఆన్లైన్ పరీక్షలను నిర్వహించేందుకు మౌలిక వసతులు సైతం లేవని కమిటీ సభ్యులు భావిస్తున్నట్లు సమాచారం. బహుళ ఐచ్ఛిక ప్రశ్నలతో పరీక్షలు నిర్వహిస్తే జాప్యం కాకుండా ఫలితాలు ఇవ్వొచ్చన్న సూచనలూ కమిటీకి అందాయి. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని కొద్దిరోజుల్లోనే నివేదిక ఇవ్వనుంది. కమిటీ నివేదిక తర్వాత పరీక్షలపై ప్రత్యేకంగా ఆదేశాలిస్తామని ఏఐసీటీఈ వర్సిటీలకు కూడా లేఖ రాసింది.
ఇదీ చూడండి : మీరు నీలిచిత్రాలు చూస్తున్నారా... జాగ్రత్త