All India Lawyers Union Seminar in Hyderabad : దేశంలో వ్యవస్థలన్నింటికీ భారత రాజ్యాంగమే మార్గనిర్దేశమని మాజీ న్యాయమూర్తులు స్పష్టం చేశారు. పౌరుల ప్రాధమిక హక్కులకు భంగం కలిగించే ఏ సందర్భంలోనైనా న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవచ్చని అభిప్రాయపడ్డారు. న్యాయవ్యవస్థకు స్వయం ప్రతిపత్తి కల్పించిన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్దదని వ్యాఖ్యానించారు. న్యాయ, శాసన, కార్యనిర్వహక వ్యవస్థల విధులు, పరిమితులు, అధికారాల గురించి రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశించిందన్నారు.
హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తెలంగాణ కమిటీ ఆధ్వర్యంలో "రాజ్యాంగం-ప్రజలమైన మేము'' పేరుతో సదస్సు జరిగింది. 'రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణం పునఃపరిశీలన' అనే అంశంపై విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు ప్రసంగించారు. న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల విధులు, పరిమితులు, అధికారాల గురించి రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశించినట్లు ఆయన తెలిపారు.
Justice L Nageswara Rao on Civil Rights : పార్లమెంట్, రాష్ట్రాల శాసనసభలు పౌరులకు ఉపయుక్తమైన శాసనాల్ని రూపొందించాల్సి ఉందన్నారు. న్యాయవ్యవస్థకు రాజ్యాంగం స్వయం ప్రతిపత్తి కల్పించిందన్న ఆయన చట్టసభలు రూపొందించే చట్టాలు ప్రజల మనోభావాలను కించపరిచేట్లు ఉంటే న్యాయవ్యవస్థ జోక్యం చేసుకుంటుందని స్పష్టం చేశారు. అలాంటి చట్టాల అమలును నిలిపివేసిన సందర్భాలు గతంలో ఎన్నో ఉన్నాయని పేర్కొన్నారు.
'ఉపరాష్ట్రపతి, ఆ కేంద్రమంత్రిని తొలగించాలి'.. సుప్రీంలో పిటిషన్
''ఇవాళ మనం ప్రజాస్వామ్యం ఫలాలు పొందుతున్నామంటే.. పార్లమెంటు, కార్యనిర్వాహక వ్యవస్థలపై న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవడమే కారణం. న్యాయస్థానాలే సర్వోన్నతమని నేను చెప్పడం లేదు. దేశంలో ఏ వ్యవస్థ సుప్రీం కాదు.. రాజ్యాంగం మాత్రమే సుప్రీం. పార్లమెంటు సర్వోన్నతమని రాజకీయనాయకులు చేసే నినాదాలు సరికాదు. రాజ్యాంగానికి లోబడి పౌరుల హక్కులు కాపాడటం మనందరి విధి. న్యాయవ్యవస్థకు చెందిన వ్యక్తులుగా ఇది మాకు అదనపు బాధ్యత''-జస్టిస్ లావు నాగేశ్వరరావు, సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి
ఏడు దశాబ్దాల న్యాయవ్యవస్థ అనే అంశంపై ఒడిశా హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.మురళీధర్ ప్రసంగించారు. "రాజ్యాంగ సమాఖ్య స్ఫూర్తి'' అనే అంశంపై ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ టి.రజని, రాజ్యసభ సభ్యులు జాన్ బ్రిట్టాస్ ప్రసంగించారు. సామాన్యులకు ఏదైనా అన్యాయం జరిగితే హైకోర్టు, సుప్రీం కోర్టులకు రాలేరన్న జస్టిస్ రజని.. వారికి అందుబాటులో ఉండే తాలూకా కోర్టులు బలోపేతం కావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.
ఈ సెమినార్లో ఐలు రాష్ట్రకమిటీ ప్రచురించిన ప్రత్యేక సంచికను జస్టిస్ లావు నాగేశ్వరరావు విడుదల చేశారు. కర్ణాటక హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ నాగమోహన్దాస్ రచించిన రాజ్యాంగం మనకేమిచ్చింది..? అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. రాజ్యాంగం-ప్రజలు అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సదస్సులో ఐలు రాష్ట్రశాఖ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు కొల్లి సత్యనారాయణ, కె.పార్ధసారధి, ఎం.వి.దుర్గాప్రసాద్, సీహెచ్ శైలజ తదితరులు పాల్గొన్నారు.
సుప్రీం జడ్జీలుగా ఇద్దరు ప్రమాణం.. 9 నెలల తర్వాత తొలిసారి అలా..
'జైలులోనే ఇమ్రాన్ హత్యకు కుట్ర.. గుండెపోటు వచ్చేలా ఇంజెక్షన్లు ఇచ్చి చిత్రహింసలు!'