.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నియంత్రిత సాగుకు సంబంధించి మీ అనుభవాలు ఏమైనా ఉన్నాయా?
70 ఏళ్లుగా ప్రాజెక్టులు నిర్మించి, హరిత విప్లవాలు సహా ఎన్నో చేసి ఆహార భద్రత కల్పించుకుని... పోషక భద్రత వైపు వెళ్తున్నాం. తెలంగాణలో గత ఆరేళ్లుగా రైతు నిలదొక్కుకునేందుకు ఏం కావాలన్న విషయమై దృష్టి సారించి కరెంట్, నీళ్ల బాధలు తీర్చుకున్నాం. ఇప్పటి వరకు పంట పండించి మార్కెట్ వైపు చూశాం, ఇపుడు మార్కెట్ ఆధారిత వ్యవసాయం చేయాలన్నది ఆలోచన. ఇతర రాష్ట్రాల్లోనూ పరిస్థితులను స్థూలంగా అధ్యయనం చేశాం. కేరళ, తమిళనాడుకు బియ్యం అదనంగా అవసరం. ఏ పంట పడితే ఆ పంట వేసి రైతు ఆగమాగం అవ్వకూడదు. నియంత్రిత విధానంలో సాగు చేస్తే రైతు నష్టపోకుండా చూసే అవకాశం ఉంది. శాస్త్రీయంగా, ఇతర దేశాల్లోనూ దీని గురించి ఆలోచిస్తున్నారు.
రైతులు సహజంగా కొన్ని పంటల సాగుకు అలవాటు పడి ఉంటారు. ఒక్కసారిగా పంట మార్చాలంటే ఆ ప్రభావం ఎలా ఉంటుంది?
కొత్త పంటలను రైతు ముంగిట్లోకి తీసుకురావడం లేదు. ఉన్న పంటల విస్తీర్ణాన్నే పెంచాలని ప్రయత్నిస్తున్నాం. పత్తి, వరి, కందుల సాగు మన రాష్ట్ర బలం. వాటిలో విస్తీర్ణం పెంచుతున్నాం.
70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అంటున్నారు. కానీ, గత అనుభవాలు చేదుగా ఉన్నాయి. దీనిపై మీ అభిప్రాయమేంటి?
పత్తి విషయంలో గత నాలుగైదు సంవత్సరాలుగా దృష్టి సారించాం. నవంబర్, డిసెంబర్లో పత్తి కోతలు ఉండేలా చూడాలని చెప్తున్నాం. రైతులు అర్థం చేసుకున్నారు. దీంతో ఆర్నెళ్ల ఆంతర్యం ఉంటోంది. వర్షాకాలంలో దక్షిణ తెలంగాణలో మొక్కజొన్న 60 నుంచి 70శాతం సాగు చేస్తారు. 15 రోజుల పాటు వర్షాభావ పరిస్థితులు వస్తే దిగుబడి పడిపోయి రైతులు నష్టపోతారు. ఇలా జరగకుండా శాస్త్రీయంగా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకునే చర్యలు తీసుకుంటున్నారు.
సమగ్ర వ్యవసాయ విధానం, నియంత్రిత సాగులో వ్యవసాయ విశ్వవిద్యాలయం పాత్ర ఎలా ఉండబోతోంది?
ప్రభుత్వానికి అవసరమైన సాంకేతిక సహకారం అందిస్తున్నాం. మార్కెట్ డిమాండ్ విశ్లేషణ కోసం అవసరమైన సమాచారం అందిస్తున్నాం. రాష్ట్రంలో, దేశవ్యాప్తంగా అపరాల కొరత ఉంది. కందుల సాగు పెంచమంటున్నాం. రైతులు గౌరవప్రదమైన స్థితిలో ఉండాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. మా వంతుగా వంగడాల అభివృద్ధి, సాంకేతిక సహకారం, తదితరాలు అధ్యనయం చేసి అందిస్తాం. విధాన రూపకల్పనకు తోడ్పడేలా పరిశోధన, ఎజెండా ఉంటుంది.
వరి, పత్తిలో కొత్త వంగడాలు రావాలని సీఎం కేసీఆర్ తెలిపారు. వాటిపై పరిశోధనలు ఎలా జరుగుతున్నాయి?
ఇందుకు సంబంధించి గత నాలుగైదేళ్లుగా పరిశోధనలు సాగుతున్నాయి. 6.2 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ పొడవుండే ధాన్యం వంగడాలు ఎనిమిది ఉన్నాయి. మరో 17 వంగడాలు వివిధ దశల్లో ఉన్నాయి. పత్తి పంట ఒకేమారు వచ్చేలా నాగపూర్ పత్తి పరిశోధనా కేంద్రంతో కలిసి పనిచేస్తున్నాం. ఆ దిశగా ప్రయణాలు సాగుతున్నాయి.
కేంద్రం కొన్ని క్రిమిసంహారక మందులను నిషేధించింది. ఈ విషయమై రైతులకు ఏం చెబుతారు?
భూసారం దెబ్బతినడం, వాతావరణ కలుషితం, కూలీల ఆరోగ్యం దెబ్బతినడం, ముఖ్యంగా ఉత్పత్తులపై అవశేషాలు ఉండటాన్ని పరిగణలోకి తీసుకుంటారు. తగిన సమాచారం లేనప్పుడు ఇటువంటి నిర్ణయం తీసుకుంటారు. కొత్త క్రిమిసంహారక మందుల బిల్లు కూడా రాబోతోంది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటాం.
ఇవీ చూడండి: 'వానాకాలంలో పంట మార్పడి చేద్దాం.. యాసంగిలో మక్కలు వేద్దాం'