సచివాలయం కూల్చివేతతో హుస్సేన్ సాగర్ కాలుష్యానికి గురయ్యే అవకాశం లేదని సంయుక్త కమిటీ వెల్లడించింది. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్లో భాగంగా ఎన్జీటీ చెన్నై ధర్మాసనం.. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కమిటీని నియమించింది. పరిశీలన చేసిన కమిటీ.. సచివాలయం కూల్చివేత- కాలుష్య ప్రభావంపై జాతీయ హరిత ట్రైబ్యునల్కు నివేదిక సమర్పించింది. సెక్రటేరియట్ కూల్చివేత పూర్తయిందని... సరైన జాగ్రత్తలు తీసుకునే కూల్చివేత జరిపినట్లు నివేదికలో పేర్కొంది.
రోడ్లు, భవనాల శాఖ, రాష్ట్ర పీసీబీ సమర్పించిన పత్రాల ఆధారంగా అవసరమైన జాగ్రత్తలు పాటిస్తూ కూల్చివేత పూర్తి చేసినట్లు కమిటీ నిర్ధరించింది. సచివాలయ భవనం కూల్చివేతతో వచ్చిన లక్షా 14 వేల 447 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను జీడిమెట్లలోని డంపింగ్ యార్డుకు తరలించి ప్రాసెసింగ్ చేస్తున్నట్లు నివేదికలో పేర్కొంది. కొత్త సచివాలయ నిర్మాణంలో భాగంగా వచ్చే వ్యర్థాలను కూడా నిర్మాణ, కూల్చివేత వ్యర్థాల నిర్వహణ- 2016 నిబంధనలు, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాల ప్రకారం వ్యర్థాలను తొలగించాలని కమిటీ సూచించింది.
ఇదీ చదవండి: ' పాఠశాలల కొనసాగింపుపై సభలోనే ప్రకటిస్తా'