హైదరాబాద్ నుంచి నాగ్పూర్ జాతీయ రహదారిని పారిశ్రామిక కారిడార్గా ప్రభుత్వం ప్రకటించింది. దీనికి అనుగుణంగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇటీవల అసెంబ్లీలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న కారిడార్ విషయాన్ని ప్రస్తావిస్తూ.. జిల్లాలో 20 వేలకుపైగా నిరుద్యోగులు ఉన్నట్లు గుర్తు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేస్తే అభివృద్ధితోపాటు వేలాది మందికి ఉపాధి లభిస్తుందని సభాముఖంగా విన్నవించారు. అనంతరం పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్కు సైతం లేఖను అందజేశారు. తాజాగా యంత్రాంగం ఆ దిశగా అడుగులు ఆరంభించడం జిల్లాకు కలిసి రానుంది.
70 కిలోమీటర్ల రహదారి పొడవు
జిల్లాలో నేరడిగొండ నుంచి పెన్గంగా నది వరకు దాదాపు 70 కిలోమీటర్ల వరకు నాలుగు వరుసల జాతీయ రహదారి పొడవు ఉంటుంది. ఈ రహదారి పక్కల పరిశ్రమల ఏర్పాటుకు రాయితీలు కల్పించనున్నారు. సరకు రవాణా కోసం నాలుగు వరుసల రహదారి ఉండడం, రైలు మార్గం ఉపయోగపడడం పరిశ్రమల స్థాపనకు కలిసి రానుంది.
జిల్లాలో అనువుగా ఉన్న సిమెంటు, కాగితపు, వస్త్ర పరిశ్రమలతోపాటు ఇతర అందుబాటులో ఉన్న ముడిసరుకు ఆధారంగా ఏఏ పరిశ్రమలు ఏర్పాటు చేయవచ్చనే దిశగా ఆలోచన చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. దీనికోసం అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలతోపాటు ప్రైవేటు స్థలాల వివరాలు సేకరించనున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన భూముల ధరలు ఏవిధంగా ఉన్నాయి, మార్కెట్లో భూముల ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు తెలుసుకోనున్నారు. రహదారి పొడవునా ఇరు పక్కల స్థలాలను పరిశీలించనున్నారు. రహదారి మధ్యలో ఏజెన్సీ ఏరియా, అటవీశాఖ భూములు సైతం ఉండడంతో ఆ వివరాలను సైతం పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం. మొత్తం మీద జిల్లాలో ప్రభుత్వ పరంగా లభించే రాయితీలతో పరిశ్రమల ఏర్పాటుకు అడుగులు పడడం శుభపరిణామం.
- ఇదీ చూడండి రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎస్ఈసీ సమావేశం