ప్రాణాంతక కరోనా మహమ్మారి దెబ్బకు చరిత్రలో తొలిసారిగా ఒలింపిక్స్ వాయిదా పడ్డాయి. వచ్చే ఏడాది టోక్యో క్రీడలను నిర్వహించనున్నట్లు ప్రకటించేశారు. ప్రస్తుతానికైతే అంతా బాగానే ఉంది. కానీ.. వచ్చే ఏడాది ఈ మెగా క్రీడల నిర్వహణ.. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)కి పెను సవాలు విసరనుంది. క్రీడలు జరిగే తేదీలను నిర్ణయించడమే పెద్ద సమస్యగా మారింది. అర్హత టోర్నీల నిర్వహణ.. ప్రసారదారు, వాటాదారులను బుజ్జగించే ప్రయత్నాలు ఐఓసీకి తలనొప్పిగా మారనున్నాయి.
టోక్యో
ఏడాది పాటు వాయిదా పడ్డ టోక్యో ఒలింపిక్స్ను తిరిగి వచ్చే సంవత్సరం ఏ తేదీల్లో నిర్వహించాలనే విషయంలో అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బాక్ తెలిపాడు. మహమ్మారి కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది జులై 24న ఆరంభం కావాల్సిన ఒలింపిక్స్ను ఏడాది పాటు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే తిరిగి వాటిని నిర్వహించే తేదీలను ఇంకా ప్రకటించలేదు. వచ్చే ఏడాది వేసవిలోపు మాత్రం క్రీడలు జరిగేలా చూస్తామని పేర్కొన్నారు. కానీ బుధవారం కాన్ఫ్రెన్స్ కాల్ ద్వారా బాక్ మాట్లాడుతూ.. ‘‘కేవలం వేసవి నెలల్లోనే ఈ క్రీడలు జరుగుతాయని చెప్పలేం. అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నాం. 2021 వేసవికి ముందు కూడా ఒలింపిక్స్ను ప్రారంభించే అవకాశాలను కొట్టిపారేయలేం. వాయిదా పడ్డ ఈ క్రీడలు తిరిగి జరగాలంటే వాటాదార్ల త్యాగం, రాజీపడడం ఎంతో అవసరం. ఒలింపిక్స్లో పాల్గొనాలనే అథ్లెట్ల కలను నిజం చేయడం ఐఓసీ ధ్యేయం. వచ్చే ఏడాది ఒలింపిక్స్ను నిర్వహించడం పెను సవాలే. ఈ పరిణామాలన్నింటినీ పరిశీలించి.. క్రీడలు సవ్యంగా సాగేలా చూసేందుకు ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశాం. 33 అంతర్జాతీయ క్రీడా సమాఖ్యలతో చర్చించబోతున్నాం. వచ్చే ఏడాది క్రీడా క్యాలెండర్ను దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒలింపిక్స్కు హృదయం లాంటి క్రీడా గ్రామాన్ని పర్యవేక్షిస్తూనే ఉండాలి’’ అని పేర్కొన్నాడు.
ఆశలు.. నిరాశలు..
టోక్యో ఒలింపిక్స్ వాయిదా పడడంపై అథ్లెట్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ''జులై 25న తొలి మ్యాచ్ ఆడేందుకు మానసికంగా సిద్ధమయ్యాం. ఏడాది పాటు ఒలింపిక్స్ను వాయిదా వేయడం నిరాశ కలిగించింది. అయినప్పటికీ ఈ పరిస్థితుల్లోనూ సానుకూల దృక్పథంతో సాగుతాం’’ అని భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ మన్ప్రీత్ సింగ్ తెలిపాడు. గత రెండేళ్లలో జట్టు క్రమంగా మెరుగైందని, ఒలింపిక్స్ ముందు మంచి ఫామ్లో ఉందని.. ఆ సమయంలో క్రీడలు వాయిదా పడడం నిరాశ కలిగించిందని మహిళల జట్టు సారథి రాణి రాంపాల్ చెప్పింది. ''ఈ నిర్ణయాన్ని సానుకూలంగా తీసుకోవాలి. ఆటపై మరింత దృష్టి పెట్టాలి. మరింత కఠినంగా సాధన కొనసాగించాలి'' అని తొలిసారి ఒలింపిక్స్కు అర్హత సాధించిన జావెలిన్ త్రో ఆటగాడు నీరజ్ చోప్రా అంటున్నాడు. దిగ్గజ బాక్సర్ మేరీకోమ్, అగ్రశ్రేణి షట్లర్ సైనా నెహ్వాల్ కూడా ఒలింపిక్స్ వాయిదా నిర్ణయాన్ని స్వాగతించారు. ''ఒలింపిక్స్ను ఏడాది పాటు వాయిదా వేయడం కొంతమంది అథ్లెట్ల కెరీర్లపై ప్రభావం చూపే వీలుంది. అలాంటి ఆటగాళ్లకు పూర్తి అండగా నిలుస్తాం. దేశంలో లాక్డౌన్ను ఎత్తేశాక క్రీడా సమాఖ్యలతో మాట్లాడతాం'' అని భారత ఒలింపిక్ సంఘం కార్యదర్శి రాజీవ్ మెహతా పేర్కొన్నాడు.''టోక్యో ఒలింపిక్స్ను వాయిదా వేయడాన్ని స్వాగతిస్తున్నా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అథ్లెట్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. అథ్లెట్లు ఏ మాత్రం నిరాశ చెందకుండా వచ్చే ఏడాది కోసం పూర్తి స్థాయిలో సిద్ధమవ్వాలి. 2021లో అత్యుత్తమ ప్రదర్శన చేసేలా ప్రయత్నించాలి'' అని కేంద్ర క్రీడల మంత్రి కిరెన్ రిజుజు తెలిపాడు.
ఏడాదిలో ఏం చేద్దాం?
క్రీడలు వాయిదాపడడంతో తమ అథ్లెట్ల శిక్షణ, సాధన ప్రణాళికలను మరింత సమర్థంగా రూపొందించే ప్రయత్నాల్లో కోచ్లు మునిగిపోయారు. ''ఈ విరామం షూటర్లపై ప్రభావం చూపే వీలుంది. తొలిసారి ఒలింపిక్స్ కోసం సిద్ధమవుతోన్న యువ షూటర్లపై అది ఇంకా ఎక్కువగా ఉండనుంది. గత మూడేళ్లుగా ఒలింపిక్స్ కోసం సన్నద్ధమవుతున్నాం. అయినప్పటికీ కరోనా నేపథ్యంలో క్రీడల వాయిదా నిర్ణయాన్ని సమ్మతించాల్సిందే. ఇది కేవలం అథ్లెట్ల గురించి కాదు మొత్తం ప్రపంచం గురించి ఆలోచించాల్సిన సమయం'' అని జాతీయ షూటింగ్ కోచ్ జస్పాల్ రాణా పేర్కొన్నాడు. వచ్చే ఏడాది నిర్వహించే ఒలింపిక్స్ తేదీలు ప్రకటించిన తర్వాతే బాక్సర్ల శిక్షణ ప్రణాళికల్లో మార్పులు చేస్తామని భారత బాక్సింగ్ హై పర్ఫార్మెన్స్ డైరెక్టర్ శాంటిగో తెలిపాడు. ఏడాది విరామం కారణంగా ఆటగాళ్ల సాధనపై ఎలాంటి వ్యతిరేక ప్రభావం పడుతుందని అనుకోవట్లేదని జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ అభిప్రాయపడ్డాడు.
ఇదీ చూడండి: కరోనాపై ఫైట్కు స్టార్ ఫుట్బాలర్ భారీ సాయం