కరోనా ధాటికి ప్రపంచం విలవిల్లాడుతోంది. వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. ఆ వైరస్ పేరు వింటేనే భయపడే పరిస్థితి తలెత్తింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్ సైతం వాయిదా పడ్డాయి. ఈ వైరస్ కారణంగా వివిధ రంగాలు నష్టాల బాట పడుతుంటే.. ఒక్క రంగం మాత్రం అభివృద్ధి దిశగా సాగుతోంది. అదే ఈ- స్పోర్ట్స్. కరోనా మహమ్మారి దెబ్బకు అందరూ ఇళ్లకే పరిమితం కావడం వల్ల అంతర్జాలంలో ఆటలాడే వాళ్ల సంఖ్య పెరుగుతోంది. ఈ- స్పోర్ట్స్ వృద్ధి చెందడానికి, ప్రపంచ వ్యాప్తంగా కొత్త ఆటగాళ్లను ఆకర్షించడానికి ఇదే సరైన సమయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇంట్లో ఉంటూనే..
ప్రస్తుత పరిస్థితుల్లో బయటకు వెళ్లి మైదానాల్లో ఆటలు ఆడే అవకాశమే లేదు. టీవీల్లోనూ మ్యాచ్లు చూసే వీల్లేదు. ఇంట్లోనే ఉంటూ.. కంప్యూటర్ ముందు కూర్చుని.. అంతర్జాలంలో ఆటలాడేస్తే.. కావాల్సినంత కాలక్షేపం దొరుకుతుంది కదా అని ఆలోచిస్తున్న ప్రజలు ఈ- స్పోర్ట్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. జర్మనీలోని ప్రధాన ఫుట్బాల్ క్లబ్ల మధ్య "బుండెస్ లీగ్ హోం ఛాలెంజ్" టోర్నీని నిర్వహిస్తున్నారు. ఒక్కో జట్టులో ఒక్కో ప్రొఫెషనల్ ఆటగాడు కూడా ఉంటాడు. అమెరికాలో ఈ- నాస్కర్ వర్చువల్ కారు రేసు కూడా అలాంటిదే. ఇందులో ఇప్పటికే రెండు రేసులు జరిగాయి. మరోవైపు ఎన్బీఐ 2కె వర్చువల్ టోర్నీ అభిమానులకు బాస్కెట్బాల్ మజాను అందిస్తోంది. ఫార్ములావన్ ఈ- స్పోర్ట్స్ గ్రాండ్ ప్రిలో ఛార్లెస్ లెక్లెర్క్ (ఫెరారీ), అలెక్స్ (రెడ్బుల్), నోరిస్ (మెక్లారెన్) లాంటి ఎఫ్1 రేసర్లతో ఇంగ్లాండ్ క్రికెటర్ స్టోక్స్ పోటీపడబోతున్నాడు. ఈ ఆటల్లో మార్పు ఉండదు.. అందించే కిక్లో తేడా ఉండదు.. కానీ ఆటగాళ్లు బయట కాకుండా కంప్యూటర్ తెరల ముందు సిమ్యులేటర్లతో పోటీపడతారంతే. ఈ టోర్నీలన్నింటినీ ప్రత్యక్ష ప్రసారం కూడా చేస్తున్నారు.
సంఖ్య పెరుగుతోంది..
ఇటీవల కాలంలో ఈ- స్పోర్ట్స్ రంగంలో గణనీయ వృద్ధి కనిపిస్తోంది. వాషింగ్టన్ పోస్టు నివేదిక ప్రకారం యుఎస్, దక్షిణకొరియాకు చెందిన ఓ ప్రొఫెషనల్ గేమింగ్ సంస్థ అందించే పబ్జీ, లీగ్ ఆఫ్ లెజెండ్స్ ఆటలను చైనాలో ఆడే, చూసే వాళ్ల సంఖ్య గత రెండు నెలల్లో 18.2 శాతం పెరిగింది. ఈఎస్ఎల్ ప్రొ లీగ్ను తొలి రోజు (మార్చి 16) లక్షా 46 వేల మంది చూశారు. గతేడాదితో పోలిస్తే 27 శాతం వృద్ధి కనిపించింది. భారత్లోనూ ఆ జోరు కొనసాగుతోంది. భారత ఈ- స్పోర్ట్స్ వేదికైన వింజో వృద్ధి 30 శాతం పెరిగింది. 2021 వరకూ దేశంలో ఈ- స్పోర్ట్స్ ఆడేవాళ్లు, చూసేవాళ్ల సంఖ్య అయిదు రెట్లు పెరుగుతుందని ఓ అంచనా. 2017లో 20 లక్షలుగా ఉన్న ఆ సంఖ్య 2021లో కోటికి చేరనుంది.
వీటిల్లోనూ..
కంప్యూటర్లలో ఆడేవే అయినా ఈ-స్పోర్ట్స్పైనా కరోనా ప్రభావం ఉంది. ఈ క్రీడలన్నీ ఆన్లైన్లోనే జరుగుతున్నప్పటికీ పెద్ద టోర్నీలు స్టేడియాల్లో పెడతారు. వ్యక్తిగతంగా లేదా జట్టుతో కలిసి ఆ టోర్నీల్లో పాల్గొనాలి. పోటీలు అంతర్జాలంలోనే అయినా ప్రేక్షకుల నడుమ పోటీపడాల్సి ఉంటుంది కాబట్టి కొన్ని టోర్నీలు వాయిదా పడ్డాయి. మరోవైపు అన్ని పెద్ద ఛాంపియన్షిప్స్.. లోకల్ ఏరియా నెట్వర్క్ (ల్యాన్) పరిధిలోనే జరుగుతాయి. వీటిని ల్యాన్ నుంచి తప్పించి బయట నిర్వహించాలంటే కొన్ని టెరాబైట్ల డేటా కావాలి. అది ఖర్చుతో కూడుకున్న పని. కాబట్టి ఈఎస్ఎల్ వన్ రియో 2020 కౌంటర్ స్ట్రైక్ లాంటి టోర్నీల వాయిదా తప్పలేదు.