Australian open Sania mirza: ఆస్ట్రేలియన్ ఓపెన్లో భాగంగా ఆదివారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ పోటీల్లో సానియా మీర్జా-రాజీవ్ రామ్(అమెరికా) జోడీ విజయాన్ని అందుకుంది. రెండో రౌండ్లో మాట్వే మిడిల్కూపా(నెదర్లాండ్స్)-ఎల్లెన్ పెరెజ్ (ఆస్ట్రేలియా) జోడీని 7-6(4)-6-4 తేడాతో సానియా ద్వయం ఓడించింది. తద్వారా ఈ టోర్నీలో క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నారు సానియా-రామ్.
ఈ మ్యాచ్ గంట 27 నిమిషాల పాటు సాగింది. మొదటి రౌండ్లో రెండు జోడీలు హోరాహోరీగా తలపడ్డాయి. దీంతో సెట్ను కైవసం చేసుకునేందుకు సానియా జోడీ తీవ్రంగా శ్రమించింది. అనంతరం మాట్వే-ఎల్లెన్ల చేసిన తప్పిదాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్న సానియా ద్వయం మొదటి సెట్ను కైవసం చేసుకుంది. ఇక రెండో సెట్లో వీరు పూర్తి ఆధిపత్యం వహించారు. దీంతో ఈ టోర్నీలో రెండో విజయం సాధించి క్వార్టర్స్ చేరుకున్నారు.
తొలి రౌండ్లో సెర్బియా ద్వయం అలెక్సంద్రా క్రునిక్-నికోలాను వరుస సెట్లలో 6-3, 7-6(3) తేడాతో ఓడించింది సానియా జోడీ. ఈ మ్యాచ్ 69 నిమిషాల పాటు సాగింది. ఈ మ్యాచ్ విజయంలో రామ్ కీలకంగా వ్యవహరించాడు. అతడు 2021లో బార్బొరాతో కలిసి మిక్స్డ్ డబుల్స్లో టైటిల్ను దక్కించుకున్నాడు.
ఇప్పటికే డబుల్స్ విభాగంలో సానియాతో పాటు మరో భారత ఆటగాడు బోపన్న ఇంటిముఖం పట్టారు. తొలి రౌండ్లోనే ఓడి నిరాశపర్చారు. కాగా, ఈ టోర్నీ తర్వాత తన కెరీర్కు గుడ్బై చెప్పనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది సానియా. దీంతో గ్రాండ్స్లామ్ విక్టరీతో ఆమె ముగింపు పలకాలని అభిమానులు భావిస్తున్నారు.
ఇవీ చూడండి: 'శ్రీవల్లి' పాటకు స్టెప్పులేసిన రైనా.. బన్నీ నటనకు ఫిదా