ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ రెండో సీజన్(WTC Second Edition)పై టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) స్పందించాడు. ఈ ఎడిషన్లో అభిమానులకు కావాల్సినంత ఉత్సాహాన్ని భారత జట్టు అందిస్తుందని తెలిపాడు. ఈ సీజన్ కోసం తమ టీమ్ నూతన శక్తితో ఎదురుచూస్తుందని పేర్కొన్నాడు.
"డబ్ల్యూటీసీ ఆరంభ ఎడిషన్లోనే ఫైనల్ చేరుకోవడం ఆనందానిచ్చింది. అందులోనూ కివీస్ వంటి బలమైన జట్టుతో పోటీపడటం గొప్ప విషయం. ఒక్క ఫైనల్లోనే కాదు. ఛాంపియన్షిప్ మొత్తంలోనూ ఆటగాళ్లు దృఢ సంకల్పాన్ని ప్రదర్శించారు. తదుపరి సీజన్ కోసం ఆటగాళ్లతో పాటు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్ కోసం కొత్త శక్తితో ఉన్నాం. అభిమానులకు కావాల్సినంత వినోదం పంచడానికి సిద్ధం."
-విరాట్ కోహ్లీ, టీమ్ఇండియా కెప్టెన్.
భారత్-ఇంగ్లాండ్ మధ్య ఆగస్టు 4 నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్టుతో డబ్ల్యూటీసీ రెండో ఎడిషన్ ప్రారంభమవుతుంది. ఛాంపియన్షిప్ తొలి ఎడిషన్ ఫైనల్ సౌథాంప్టన్ వేదికగా టీమ్ఇండియా-న్యూజిలాండ్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో కివీస్ జట్టు 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. పరాభవంతో కోహ్లీ సేన రన్నరప్గా నిలిచింది.
ఇటీవల భారత పర్యటనలో కోహ్లీ సేనతో టెస్టు సిరీస్ను 3-1తో కోల్పోయింది ఇంగ్లాండ్ జట్టు. దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరే అవకాశాన్ని ఆ టీమ్ చేజార్చుకుంది. ఇప్పుడు అదే టీమ్ఇండియాతో రెండో ఎడిషన్ను రూట్ సేన ప్రారంభించనుంది.
ఇదీ చదవండి: MS Dhoni: స్నేహితులతో ధోనీ.. ఫొటో వైరల్