'కౌన్ బనేగా కరోడ్పతి'.. ఈ షో ఎంత పెద్ద హిట్టయిందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం 13వ సీజన్ జరుగుతోంది. తాజాగా ఈ షోకు టీమ్ఇండియా మాజీ సారథి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అతిథులుగా వచ్చారు. కెరీర్ సహా అనేక విశేషాలు చెబుతూ అలరించారు.
ఈ షోలో దాదా, వీరూ రూ.25లక్షలు గెలిచారు. రూ.50 లక్షల ప్రశ్నకు వారు సమాధానం ఇవ్వలేకపోయారు. అయితే గెలుచుకున్న రూ.25 లక్షలను ధార్మిక పనుల కోసం విరాళంగా ఇచ్చారు. ఈ షో సాంతం ఆసక్తికరంగా సాగినట్టు సమాచారం. ఇప్పటికే విడుదలైన ప్రోమో వైరల్గా మారింది.
సాధారణంగా అమితాబ్ బచ్చన్ అందరినీ ప్రశ్నలడిగితే.. ఆయన సీటును దాదా తీసుకొని బిగ్బీని హాట్సీట్లో కూర్చోబెట్టారు. యాంకర్గా గంగూలీ ప్రతిభను చూసిన బిగ్ బీ.. "ఇలాగే కొనసాగితే నా పనికే ఎసరు పెడతారేమో" అని సరదాగా వ్యాఖ్యానించారు. దానికి "ఒకవేళ నేను హోస్ట్ చేయాల్సి వస్తే ముందుగా మీ వీడియోలు చూసి నేర్చుకుంటా" అని దాదా బదులిచ్చారు.
సెహ్వాగ్ తనదైన రీతిలో హాస్య గుళికలు విసిరాడు. టీమ్ఇండియాకు అవసరమైన ప్రతిసారీ దాదా తనపై ఆధారపడేవాడని వివరించాడు. వేగంగా పరుగులు చేయాలన్నా, దూకుడుగా ఆడాలన్నా, ఫీల్డింగ్ అవసరమైనా, బౌలింగ్ చేయాలన్నా, జట్టుకు విజయం అందించాలన్నా తనను ఉపయోగించుకొనేవాడని వివరించాడు. ఇంతకీ దాదా, వీరూ ఓడిపోయిన సవాలేంటో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా?
అలాగే లార్డ్స్ టెస్టు విజయం తర్వాత గంగూలీ చొక్కా విప్పి చేసిన హడావుడిని గుర్తు చేశారు బిగ్బీ. దీనిపై మాట్లాడిన దాదా తాను ఎన్నో ఘనతల్ని సాధించినా.. అందరూ ఆ సన్నివేశాన్నే ఎక్కువగా గుర్తుంచుకుంటారని వెల్లడించారు. అలాగే కోహ్లీకి కూడా అంతే ధైర్యం ఉందని.. ఒకవేళ అతడికి ఛాలెంజ్ చేస్తే ఆక్స్ఫర్ట్ వీధుల్లో షర్ట్ లేకుండా తిరగగలడని వ్యాఖ్యానించాడు.
ప్రశ్న: ఆజాద్ హింద్ రేడియో సేవలు మొదట నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలో 1942లో ఏ దేశంలో మొదలయ్యాయి?
జపాన్, జర్మనీ, సింగపూర్, బర్మా.. ఐచ్ఛికాలను ఇవ్వగా దాదా, వీరూ నిర్దేశిత సమయంలో జవాబు చెప్పలేదు. దాంతో వారు రూ.50 లక్షలు గెలవలేకపోయారు. సరైన సమాధానం జర్మనీ కావడం గమనార్హం.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">