Virat Kohli Rohith Sharma: టీమ్ఇండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ త్వరలోనే రాణిస్తారని, వారిద్దరిపై తనకు పూర్తి నమ్మకం ఉందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ అన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న మెగా టీ20 లీగ్లో కోహ్లీ 9 మ్యాచ్ల్లో 16 సగటుతో 129 పరుగులు చేయగా.. రోహిత్ 8 మ్యాచ్ల్లో 19.13 సగటుతో 153 పరుగులే చేశాడు. దీంతో వీరిద్దరూ ఫామ్ కోల్పోయి సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఛానల్తో మాట్లాడిన గంగూలీ వారిద్దరూ త్వరలోనే పుంజుకుంటారంటూ అండగా నిలిచాడు.
Sourav Ganguly Comments: "వాళ్లిద్దరూ గొప్ప ఆటగాళ్లు. త్వరలోనే ఫామ్లోకి వచ్చి పరుగులు సాధిస్తారనే నమ్మకముంది. ప్రస్తుతం కోహ్లీ ఏం ఆలోచిస్తున్నాడో నాకు తెలియదు. కానీ, అతడు కొద్ది రోజుల్లోనే తిరిగి మునుపటి స్థితికి చేరుకుంటాడు. అలాగే నేను ఈ సీజన్లోని అన్ని మ్యాచ్లనూ చూస్తున్నా. చాలా ఆసక్తిగా సాగుతోంది. ఎవరైనా విజేతగా నిలవొచ్చు. అందరూ బాగా ఆడుతున్నారు. కొత్తగా చేరిన గుజరాత్, లఖ్నవూ కూడా అద్భుతంగా ఆడుతున్నాయి" అని గంగూలీ పేర్కొన్నాడు.
కోహ్లీ నాలుగింతలు కష్టపడతాడు.. బెంగళూరు మాజీ సారథి విరాట్ కోహ్లీ ఇతరులతో పోలిస్తే నాలుగింతలు కష్టపడతాడని, అతడు మునుపటిలా స్వేచ్ఛగా ఆడితే తిరిగి గాడిలో పడతాడని టీమ్ఇండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అన్నాడు.
కోహ్లీ ప్రస్తుతం జరుగుతోన్న 15వ సీజన్లో ఏమాత్రం ఆకట్టుకోలేకపోతున్న సంగతి తెలిసిందే. అతడు ఆడిన 9 మ్యాచ్ల్లో కేవలం 128 పరుగులే చేసి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే యువీ ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గత 15 ఏళ్లలో కోహ్లీలా కష్టపడే ఆటగాడిని చూడలేదని చెప్పాడు.
![Sourav Ganguly Comments:](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15151316_jdjd.jpg)
Yuvaraj Singh Comments: "విరాట్ ఇప్పుడు తన ప్రదర్శనతో సంతృప్తిగా లేడు. ఇతరులు కూడా ఈ విషయంలో సంతోషంగా లేరు. ఎందుకంటే అతడెంత పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకున్నాడో మనం చూశాం. సెంచరీల మీద సెంచరీలు కొట్టేవాడు.. ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాడు. ఎంతగొప్ప క్రికెటర్కైనా ఇలా అప్పుడప్పుడు జరుగుతుంది. అలాంటప్పుడు కోహ్లీ తిరిగి రాణించాలంటే ఇంతకుముందులా స్వేచ్ఛగా ఆడాలి. తనను తాను మార్చుకొని పాత కోహ్లీలా మారిపోతే.. అతడేంటో చూపిస్తాడు. ఈ తరం క్రికెటర్లలోనే మేటి బ్యాట్స్మన్ అని నిరూపించుకున్నాడు. అలాగే ఆట పట్ల ఎంత నిబద్ధతతో ఉంటాడో కొన్నేళ్లుగా చూస్తూనే ఉన్నాం" అని యువరాజ్ వివరించాడు.
ఇదీ చదవండి: రాజస్థాన్ రాజసానికి కారణం అతడేనా?