IPL 2022 DC VS GT: ఐపీఎల్ 2022 సీజన్లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. తమ తొలి మ్యాచ్ల్లో ప్రత్యర్థులను ఓడించిన దిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు నేడు రెండో మ్యాచ్లో (శనివారం) తలపడేందుకు సిద్ధమయ్యాయి. రాత్రి 7.30 గంటలకు ఎంసీఏ వేదికగా మ్యాచ్ జరగనుంది. ఇక ఇందులో గెలిచి.. రెండో విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని రెండు జట్లు ఆరాటపడుతున్నాయి. గెలిచిన జట్టు టాప్లోకి వెళ్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల బలాబలాలను పరిశీలిద్దాం.
జోరుమీద ఉన్న దిల్లీ: లీగ్లో అత్యధిక సార్లు టైటిల్ గెలుచుకున్న ముంబయి ఇండియన్స్ జట్టును తొలి మ్యాచ్లోనే ఓడించిన దిల్లీ క్యాపిటల్స్ జోరుమీద ఉంది. క్వారంటైన్ పూర్తి చేసుకున్న ఆటగాళ్లు లుంగి ఎంగిడి, ముస్తాఫిజుర్ రెహ్మాన్, సర్ఫరాజ్ ఖాన్ జట్టులో చేరనున్నారు. దీంతో జట్టుకు అదనపు బలం చేకూరనుందని చెప్పొచ్చు. గత మ్యాచ్లో శుభారంభం అందించిన ఓపెనింగ్ జోడీ పృథ్వీషా, టిమ్ సీఫెర్ట్ ఈసారి కూడా రాణించాలని యాజమాన్యం కోరుకుంటోంది. మన్దీప్, రిషభ్ పంత్, పావెల్ గత మ్యాచ్లో నిరాశపరిచారు. దిల్లీ క్యాపిటల్స్ భారీ మొత్తం వెచ్చించిన శార్దుల్ ఠాకూర్ కాస్త ఫర్వాలేదనిపించాడు. లీగ్లో మరో విజయాన్ని ఖాతాలో వేసుకోవాలంటే బౌలర్లు, బ్యాటర్లు సమష్టిగా రాణించాల్సిన అవసరం ఉంది.
ఆత్మవిశ్వాసంతో గుజరాత్: ఈ ఏడాది లీగ్లో కొత్తగా చేరిన గుజరాత్ టైటాన్స్ జట్టు అరంగేట్ర మ్యాచ్లో మరో కొత్త జట్టు లఖ్నవూపై గెలిచి ఆత్మవిశ్వాసంతో ఉంది. అయితే బలంగా ఉన్న దిల్లీ క్యాపిటల్స్పై గెలవడం అంత సులభం కాదని చెప్పొచ్చు. లఖ్నవూతో జరిగిన మ్యాచ్లో టాప్ ఆర్డర్ బ్యాటర్లు శుభమన్ గిల్, విజయ్శంకర్ నిరాశపరిచారు. మాథ్యూ వేడ్ ఫర్వాలేదనిపించాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్య, రాహుల్ తెవాటియా, మిల్లర్, అభినవ్ మనోహర్ రాణించడం సానుకూలాంశం. మరి ఈ మ్యాచ్లో ఎవరు నెగ్గుతారో చూడాలి.
ఇదీ చదవండి: 'ధోనీని చాలా రోజుల తర్వాత కలిశా.. సంతోషంగా ఉంది'