చెన్నై సూపర్ కింగ్స్తో దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్లో కేన్ విలియమ్సన్ రనౌట్ కావడానికి తన తప్పిదమే కారణమని యువ బ్యాట్స్మన్ ప్రియమ్ గార్గ్ అన్నాడు. ఆ సమయంలో చాలా బాధపడ్డానని చెప్పాడు. పదకొండో ఓవర్ చివరి బంతికి సింగిల్కు ప్రయత్నించే క్రమంలో 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద విలియమ్సన్ రనౌట్ అయ్యాడు. ఈ విషయంలో అపరాధ భావనకు లోనవకుండా.. ఆటపై దృష్టి పెట్టమని తనకు అతడు చెప్పినట్లు గార్గ్ వెల్లడించాడు.
"ఆ రనౌట్ విషయంలో చాలా బాధపడ్డా. ఒక మంచి అనుభవజ్ఞడైన బ్యాట్స్మన్ ఔట్ కావడానికి కారణమయ్యానని అనిపించింది. అయితే, విలియమ్సన్తో దీనిపై చర్చించినప్పుడు రనౌట్ గురించి ఎక్కువగా ఆలోచించొద్దని, మర్చిపోయి మ్యాచ్పై దృష్టిపెట్టమని చెప్పాడు."
ప్రియమ్ గార్గ్, హైదరాబాద్ క్రికెటర్
ప్రియమ్ గార్గ్, అభిషేక్ శర్మ ద్వయం ప్రదర్శన.. హైదరాబాద్ గెలుపులో కీలక పాత్ర పోషించింది. మ్యాచ్ చివరి వరకు క్రీజులోనే ఉన్న గార్గ్.. 26 బంతుల్లో 51 పరుగులు చేసి, ఐపీఎల్లో తొలి అర్థసెంచరీ చేశాడు. నిర్ణీత 20 ఓవర్లకు సన్రైజర్స్ 164 పరుగులు చేయగా, ఛేదనలో చెన్నై.. చివరి వరకు పోరాడి 7 పరుగుల తేడాతో ఓడిపోయింది.