టీమ్ఇండియాతో జరుగుతున్న టెస్టు సిరీస్లో ఇంగ్లాండ్ గెలుస్తుందనే నమ్మకం ఉందని ఆ జట్టు పేసర్ జోఫ్రా ఆర్చర్ ధీమా వ్యక్తం చేశాడు. అలా జరగాలంటే మూడో టెస్టులో తాము గెలవడం కీలకమని చెప్పాడు. పింక్-బాల్ టెస్టు సందర్భంగా మీడియాతో మాట్లాడిన అతడు.. ఈ టెస్టు సిరీస్పై, గులాబి బంతిపై తన అభిప్రాయాలు వెల్లడించాడు. ఇప్పటికే 1-1తో ఇరు జట్లు సమంగా నిలిచిన సిరీస్ను ఇంగ్లాండ్ సొంతం చేసుకుంటుందా? అని అడిగిన ప్రశ్నకు తప్పకుండా గెలుస్తామని ఆర్చర్ బదులిచ్చాడు.
"మేం తప్పకుండా గెలుస్తాం. అయితే, అంతకన్నా ముందు మూడో టెస్టులో విజయం సాధించడం ముఖ్యం. ఇది గెలిస్తే నాలుగో మ్యాచ్ను డ్రా చేసుకుంటాం. మేం ఎప్పుడూ గెలవాలనే ఆడతాం. కానీ రాబోయే టెస్టు అత్యంత కీలకం. ఇది గెలిస్తే చివరి టెస్టును కోల్పోకుండా చూసుకుంటాం."
- జోఫ్రా ఆర్చర్, ఇంగ్లాండ్ పేసర్
అనంతరం పింక్బాల్పై మాట్లాడుతూ.. "నిజం చెప్పాలంటే ఈ బంతి కూడా సాధారణ బంతిలాగే ఉంటుంది. పింక్ బంతితోనూ ఇంతకుముందు పలుమార్లు బౌలింగ్ చేశా" అని ఆర్చర్ చెప్పుకొచ్చాడు.
ఇదీ చూడండి: 'మొతేరా' అందాలకు క్రికెట్ ప్రేమికులు ఫిదా