గుజరాత్ అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియం(మోటేరా స్టేడియం) త్వరలోనే అరుదైన ఘనత సాధించబోతోంది. ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుకుంటోన్న ఈ మైదానం.. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా గుర్తింపు తెచ్చుకోనుంది. అహ్మదాబాద్లోని మోటేరా ప్రాంతంలో ఉన్న ఈ స్టేడియం విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా దీని ఫొటోను విడుదల చేసింది అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ). ఇది ఆస్ట్రేలియా మెల్బోర్న్ స్టేడియం కంటే పెద్దది. గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ దీన్ని పర్యవేక్షిస్తోంది.
2015 నుంచే నిర్మాణం..!
పాత మోటేరా స్టేడియంను 1982లో నిర్మించారు. ఈ మైదానంలో 49వేల మంది కూర్చుని మ్యాచ్ను వీక్షించొచ్చు. 1983లో ఈ మైదానంలో తొలి టెస్టు మ్యాచ్ వెస్టిండీస్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగింది. మాజీ క్రికెటర్ సునిల్ గవాస్కర్ ఈ స్టేడియంలోనే... టెస్టు క్రికెట్లో 10వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. అంతేకాకుండా క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ ఇదే మైదానంలో తన టెస్ట్ కెరీర్లో తొలి ద్విశతకాన్ని నమోదు చేశాడు.
2011 డిసెంబరు వరకు ఈ మైదానంలో 23 వన్డే మ్యాచ్లు జరిగాయి. అయితే ఆ తర్వాత స్టేడియంను మూసివేసి విస్తరణ పనులు చేపట్టారు. 2015లో మైదానాన్ని పూర్తిగా కూల్చేసి నూతనంగా నిర్మాణ పనులు ప్రారంభించారు. ప్రస్తుతం 1,10,000 మంది కూర్చునేలా స్టేడియంను నిర్మిస్తున్నారు. ఈ ఏడాదే దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ సన్నాహాలు చేస్తోంది.