భారత్-బంగ్లాదేశ్ తొలిసారిగా ఆడబోయే డే/నైట్ టెస్టు ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ నెల 22 నుంచి 26వరకు జరగనుంది. ఇందులో కామెంటేటర్గా ధోనీ కనిపిస్తాడనే వార్తలూ వచ్చాయి. ఇప్పుడు అది నిజం కాదని తేలింది. అతడి సన్నిహిత వర్గాల ప్రకారం... వ్యాఖ్యతగా కనిపించేందుకు మహీ ఆసక్తి చూపట్లేదట.
టీమిండియా మాజీ టెస్టు కెప్టెన్లతో ప్రత్యేక కార్యక్రమం చేయించాలని ప్రసార సంస్థ స్టార్ స్ప్రోర్ట్స్ప్రయత్నిస్తోంది. తన ప్రతిపాదననూ, బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీకి పంపింది. ఈ విషయంపై భారత బోర్డు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఇదీ తప్పిదమే...
ధోనీ కామెంటేటర్గా కనిపిస్తే.. విరుద్ధ ప్రయోజనాల అంశం ఇతడికి వర్తిస్తుంది. ప్రస్తుతం ఆటగాడిగా ఉన్న మహేంద్ర సింగ్ ధోనీ.. రిటైర్మెంట్ తీసుకోకుండా ఎటువంటి పదవీ చేపట్టడానికి వీల్లేదు. ప్రస్తుత బీసీసీఐ నిబంధనల ప్రకారం ఎవరూ రెండు పదవుల్లో ఉండకూడదు.
మిస్టర్ కూల్.. 2014లో ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత టెస్టులకు వీడ్కోలు చెప్పాడు. ఈ ఏడాది జులైలో ప్రపంచకప్ సెమీఫైనల్ తర్వాత వన్డేలకూ తాత్కాలిక విరామమిచ్చాడు. అప్పటి నుంచి ధోనీ భవిష్యత్తుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ దృష్టిలో పెట్టుకుని యువ వికెట్కీపర్ పంత్కు చాలా అవకాశాలిస్తోంది టీమిండియా యాజమాన్యం. ఇటీవల చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ధోనీ గురించి చెబుతూ... అతడి విషయాన్ని పక్కన పెట్టి భవిష్యత్తు కోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు పరోక్షంగా వెల్లడించాడు.
ఇదీ స్టార్ ప్రణాళిక...
భారత్ ఆడుతున్న తొలి డే/నైట్ టెస్టుకు సరికొత్త ప్రణాళిక రచించింది స్టార్. ఇందులో భాగంగా టీమిండియా టెస్టు మాజీ సారథులను తొలి రెండు రోజులు ఆహ్వానిస్తారు. విరాట్ కోహ్లీ సహా మాజీ కెప్టెన్లు, జట్టు సభ్యులు, బీసీసీఐ పెద్దలు జాతీయ గీతం ఆలపిస్తారు. కెప్టెన్లు.. రోజంతా కామెంటరీ బాక్స్లో కనిపిస్తారు. భారత టెస్టు క్రికెట్ చరిత్రలో తమకు ఇష్టమైన సంఘటనల గురించి మాట్లాడతారు.
మూడో రోజు మధ్యాహ్నం.. 2001లో ఆస్ట్రేలియాపై సాధించిన విజయాన్ని టీవీలో ప్రదర్శిస్తారు. వీవీఎస్ లక్ష్మణ్, సౌరభ్ గంగూలీ, హర్భజన్ సింగ్, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్ గురించి ప్రసారం చేస్తారు. నాలుగో రోజు తర్వాత నుంచి విరామ సమయంలో మాజీ కెప్టెన్లు అందరూ క్రికెట్ ఆడతారు.
చారిత్రక గులాబి బంతి టెస్టుకు ముందు ఆటగాళ్ల సాధనను టీవీల్లో ప్రసారం చేయాలని స్టార్ భావిస్తోంది. అభిమానులు మైదానాలకు వచ్చి ఉచితంగా వారి సాధనను తిలకించవచ్చు. అభిమాన ఆటగాళ్లతోనూ మాట్లాడొచ్చు.