నాగ్పుర్ వేదికగా ఆదివారం.. భారత్-బంగ్లాదేశ్ మధ్య చివరి టీ20 జరగనుంది. ఇప్పటికే 1-1తో సిరీస్ సమమైంది. నిర్ణయాత్మక మ్యాచ్లో గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని ఇరుజట్లు భావిస్తున్నాయి. మరి విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.
దిల్లీలో జరిగిన తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ గెలిచింది. రాజ్కోట్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్ను భారత్ కైవసం చేసుకుంది. సిరీస్ గెలవాలంటే నాగ్పుర్ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం.
చాహల్ మినహా మిగతా భారత బౌలర్లు.. ఈ సిరీస్లో పెద్దగా ప్రభావం చూపలేదు. కుల్దీప్ స్థానంలో సుందర్కు అవకాశం ఇచ్చినప్పటికీ వికెట్లు తీయడంలో విఫలమవుతున్నాడీ స్పిన్నర్.

రోహిత్ శర్మ ఫామ్లోకి రావడం, శ్రేయస్ అయ్యర్ రాణిస్తుండటం భారత్కు కలిసొచ్చే అంశం. ధావన్, పంత్ ఆటతీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. రాహుల్, కృనాల్ పాండ్యలు స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. మూడో మ్యాచ్కు జట్టులో మార్పులు ఉండకపోవచ్చు. బంగ్లాదేశ్.. దిల్లీమ్యాచ్లో వచ్చిన ఫలితాన్ని ఈ టీ20లో పునరావృతం చేయాలని భావిస్తోంది.

జట్లు (అంచనా)
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, లోకేశ్ రాహుల్, రిషభ్ పంత్, దీపక్ చాహర్, చాహల్, శివమ్ దూబే, కృనాల్ పాండ్య, శార్దుల్ ఠాకుర్, వాషింగ్టన్ సుందర్
బంగ్లాదేశ్: ముష్ఫీకర్ రహీమ్, మహ్మదుల్లా(కెప్టెన్), షైఫుల్ ఇస్లాం, సౌమ్య సర్కార్, అల్ అమీన్ హుస్సేన్, లిట్టన్ దాస్, మొసద్దీక్ హుస్సేన్, ముస్తాఫీజుర్ రెహ్మాన్, అఫిఫ్ హుస్సేన్, అమీనుల్ ఇస్లాం, మహ్మద్ నయీమ్